శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By ప్రీతి
Last Updated : గురువారం, 4 ఏప్రియల్ 2019 (17:08 IST)

ఇద్దరు జడ్జిలలో ఒకరి వైపే మొగ్గిన జబర్దస్త్ టీం.. జోరుగా రాజకీయ ప్రచారం

ఈటీవీలో హిట్ ప్రోగ్రామ్ జబర్దస్త్‌లో చేసే కమెడియన్లు మొన్నమొన్నటి వరకు కొంతమంది మాత్రమే, అది కూడా వేదికపై పవన్ కళ్యాణ్ మంత్రం జపించారు. ఆ ప్రోగ్రామ్స్‌లో జడ్జిలుగా వ్యవహరించే నాగబాబు, రోజాల మధ్య ఎన్నోసార్లు సేఫ్ గేమ్ ఆడిన వీరు రాజకీయాలలో మాత్రం స్టాండ్ తీసుకుని జనసేన వైపు నిలబడ్డారు. తాజాగా జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తరపున హైపర్ ఆది ప్రచారంలో పాల్గొన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఒక్క‌రో ఇద్ద‌రో కాదు దాదాపు టీం మొత్తం ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీకే మన ఓటు అంటూ ఇంటింటికీ తిరిగి మ‌రీ ప్ర‌చారం చేస్తున్నారు.
 
పవన్ తరహాలో ఇప్ప‌టికే హైప‌ర్ ఆది మెడ‌లో రెడ్ టవల్ వేసుకుని ప్ర‌చారం కొనసాగిస్తున్నాడు. నా వ‌ల్ల పార్టీకి లాభం ఉంటుందా ఉండదా అనేది నాకు అవసరం లేదు. కానీ నేను మాత్రం ప్ర‌చారం చేస్తూనే ఉంటాన‌ని చెబుతున్నాడు హైపర్ ఆది. ఇప్పుడు ఈయ‌న‌తో పాటు చ‌మ్మ‌క్ చంద్ర‌, రాకింగ్ రాకేష్, సుడిగాలి సుధీర్, రాంప్ర‌సాద్, రాఘ‌వ.. ఇలా బ్యాచ్ మొత్తం ఇంటింటికీ వెళ్లి, జనసేనకే మీ ఓటు అంటూ పాంప్లెంట్స్ పంచేస్తున్నారు. ప‌వ‌న్ అభ్యర్థిగా నిలబడిన భీమ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గంలో వాళ్లు త‌మ ప్ర‌చారం సాగిస్తున్నారు. 
 
ఇప్పటిదాకా ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి దిగని నాగబాబు ఈసారి న‌ర‌సాపురం నుంచి ఎంపిగా పోటీ చేస్తున్నాడు. ఇతని ప్రత్యర్థులుగా వైసీపీ నుంచి ర‌ఘురామ కృష్ణం రాజు, టీడీపీ నుంచి శివ‌రామ‌రాజు పోటీలో ఉన్నారు. నరసాపురంలో గట్టి పోటీ ఉండటంతో నాగ‌బాబుకు అండ‌గా జ‌బ‌ర్ద‌స్త్ టీం అంతా ప్ర‌చారం చేస్తున్నారు. ఇక, జ‌బ‌ర్ద‌స్త్ షోలో నాగ‌బాబుతో పాటు ఉండే రోజా వైసీపీలో పోటీ చేస్తున్నప్పటికీ కనీసం ఒక్కరు కూడా ఆమె కోసం ప్ర‌చారం చేయ‌క‌పోవ‌డం విశేషం.