శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : బుధవారం, 10 ఏప్రియల్ 2019 (10:01 IST)

తెరాస పేరును చంద్రబాబు విమోచనా సమితిగా మార్చండి: పవన్ కళ్యాణ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఓ విజ్ఞప్తి చేశారు. ఇటీవలికాలంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పట్ల కేసీఆర్‌కు కోపం ఎక్కువై పోయిందంటూ సెటైర్లు వేశారు. అందువల్ల తెలంగాణ రాష్ట్ర సమితిని కాస్త చంద్రబాబు విమోచన సమితిగా మార్చాలని పిలుపునిచ్చారు. 
 
భీమవరం, పాలకొల్లుల్లో మంగళవారం జరిగిన బహిరంగ సభల్లో పవన్ పాల్గొని ప్రసంగించారు. చంద్రబాబుపై కేసీఆర్‌కు మంటవుంటే.. చంద్రబాబు విమోచనా సమితి అని పార్టీ పెట్టుకో.. అంతేకానీ ఆంధ్ర ప్రజలపై పడి ఏడిస్తే ఊరుకోనని హెచ్చరించారు. 
 
భీమవరం రెండో బార్దోలి అని జాతిపిత మహాత్మా గాంధీజీ చెప్పారని గుర్తుచేశారు. ఆ స్ఫూర్తితోనే పోటీ చేస్తున్నట్టు ప్రకటించారు. భీమవరం నుంచే మార్పురావాలని ఆయన కోరారు. అందరి త్యాగాలను చదివాను అందుకే మార్పు కోసం తపన పడుతున్నట్టు తెలిపారు. 
 
చంద్రబాబు, జగన్‌ల పల్లకీలు మోసి మోసి అలసిపోయాం.. సామాన్యుల్ని పల్లకీలో ఎక్కించే కాలం అసన్నమైందన్నారు. పైగా, ఇది జనసేనతోనే అరంభమైందన్నారు. రాజకీయాలు కొన్ని సామాజిక వర్గాలకే పరిమితం కాకూడదు. అందరికీ సమన్యాయం జరిగాలి. ఇది జనసేన సిద్ధాంతమని ఆయన విస్పష్టంగా చెప్పారు. 
 
అలాగే, పాలకొల్లులో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న డాక్టర్‌ బాబ్జీ మంచితనాన్ని తీసుకెళ్లి వైసీపీ మురుగుకాల్వలో కలిపేశారన్నారు. నీతి మంతులు అవినీతి పార్టీలోకి ఎందుకు వెళ్ళారని ప్రశ్నించారు. డాక్టర్‌ బాబ్జీకి ఓటేస్తే మురుగుకాల్వలో ఓటు వేసినట్లేనని విమర్శించారు. పాలకొల్లు ప్రజలు ఎంతో మంచి వారని.. అయితే గతంలో తన అన్న మెగాస్టార్‌ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీతో వస్తే ఇదే విధంగా ఆదరించారని, అయితే కొందరు చెంచాగాళ్ళు రాజకీయ లబ్ధికి అన్నయ్యను మోసం చేశారని పవన్ ఆరోపించారు.