గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (16:09 IST)

పూతలపట్టు వైకాపా అసెంబ్లీ అభ్యర్థిని చితకబాదిన గ్రామస్థులు

చిత్తూరు జిల్లా పూతలపట్టు ఎస్సీ రిజర్వుడ్ అసెంబ్లీ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎంఎస్ బాబును ఓటర్లు చితకబాదారు. ఈ సెగ్మెంట్‌లో అధికార టీడీపీకి బలమైన పట్టుంది. అయితే ఈ నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థిగా ఎంఎస్ బాబు పోటీ చేస్తున్నారు. ఈయన గురువారం ఉదయం పోలింగ్ ప్రారంభమైన తర్వాత పోలింగ్ సరళిని తనిఖీ చేసేందుకు తన అనుచరులతో కలిసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లారు. 
 
ఈ క్రమంలో ఐరాల మండలంలోని కట్టకిందపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వెళ్లాడు. ఆ పోలింగ్ కేంద్రంలో ఓట్లన్నీ సైకిల్ గుర్తుకు పడుతున్నాయని గ్రహించిన ఆయన ఆగ్రహంతో రగిలిపోయి... ఈవీఎంలతో పాటు ఫర్నీచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో తిరగబడిన గ్రామస్థలు.. ఎమ్మెల్యే అభ్యర్థి బాబును పట్టుకుని చితకబాదారు. అంతేకాకుండా, ఆయన ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా ధ్వంసం చేశారు. 
 
ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాబును ఐరాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తొలుత తరలించి, అక్కడ ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అలాగే, ఇదే మండలంలోని రెడ్డివారిపల్లిలో కూడా టీడీపీ - వైకాపా కార్యకర్తలు, ఏజెంట్ల మధ్య ఘర్షణలు జరిగాయి. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వారిని శాంతింపజేశారు. చిత్తూరు జిల్లాలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో కేవలం ఒక్క పూతలపట్టు సెగ్మెంట్‌లోనే ఉదయం నుంచి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.