అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : ఆరుగురి దుర్మరణం!
అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. గోరంట్ల మండల పరిధిలోని బూచేపల్లి బస్స్టాప్ వద్ద ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇందులో ఆరుగురు దుర్మరణం చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు.
మృతులందరూ పుట్టపర్తి మండలం పెడబల్లికి చెందిన వారుగా గుర్తించారు. మృతి చెందిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కూలి పనుల కోసం కర్ణాటకలోని బాగేపల్లి మార్కెట్కు ఆటోలో వెళుతుండగా ఈ దారుణం సంభవించింది. బెంగళూరు నుంచి తాడిపత్రి వస్తున్న లారీ ఎదురుగా వచ్చి ఆటోను ఢీకొంది. క్షతగాత్రులను హిందూపురం ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.