కడప జిల్లాలో లారీ-కారు ఢీ... నలుగురు మృతి
శుక్రవారం ఉదయం కడప జిల్లాలో రోడ్లు రక్తమోడాయి. వేగంగా వస్తున్న లారీని కారు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరణించిన వారందరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. వివరాలిలా ఉన్నాయి.
వైఎస్సార్ జిల్లా రాజంపేట మండలం బోయిన్పల్లి సమీపంలో శుక్రవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కారు, లారీ ఢీకొనడంతో ఈ ఘోరం చోటు చేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన 8 మంది తిరుపతి నుంచి వస్తుండగా ఎదురుగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది.
ఈ ఘటనలో కారులో ఉన్న నలుగురు అక్కడికక్కడే మతి చెందగా, తీవ్రంగా గాయపడిన మరో నలుగురిని రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.