గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 26 జులై 2014 (16:15 IST)

పదేళ్లు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. 2 పిల్లలు పుట్టాక?

పదేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకున్న ఓ ప్రబుద్ధుడు.. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. ఇందుకు తలిదండ్రులను సాకుగా చెప్పాడు. పదేళ్లుగా ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత తల్లిదండ్రులు బలవంతం చేస్తున్నారంటూ మరో పెళ్లికి రెడీ అవుతున్నాడు. ఇదెక్కడి న్యాయం? అంటే తనకేం అన్యాయం చేయనంటూనే మరొక మహిళతో వివాహానికి సిద్ధపడ్డాడంటూ పెళ్లాడిన మహిళ వాపోతోంది. 
 
ఏం చేయాలో దిక్కుతోచని ఆమె భర్త తీరుపై పోలీసులను ఆశ్రయించింది. తన భర్తను తన దగ్గరకు పంపాలని కోరుతోంది. ప్రేమ వివాహాల్లోని ఓ కోణం విజయవాడలో బట్టబయలైంది. కొప్పురావూరి సంధ్యారాణి ఇంటర్ చదువుతుండగా స్థానిక బియ్యం వ్యాపారి నటరాజు కుమారుడు నవీన్ కుమార్‌తో ఆమెకు స్నేహితుల ద్వారా పరిచయమైంది. 
 
కాలక్రమంలో పరిచయం కాస్త ప్రేమగా మారింది. 2010లో వీరు పెళ్లి చేసుకుని విజయవాడ పటమట రామచంద్రానగర్‌లో కాపురం పెట్టారు. వీరి దాంపత్యానికి గుర్తుగా రెండున్నరేళ్ల చిన్వి, మూడు నెలల జిజ్ఞెశ్వర్ పుట్టారు. మే 16న కుమార్తె శ్రీ చిన్విని తీసుకుని తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లాడు. అప్పటి నుంచి పలు మార్లు ప్రాధేయపడినా భార్య దగ్గరకు వెళ్లడం మానేశాడు. 
 
దీంతో తన మామ కారణంగా తన భర్త తన దగ్గరకు రావడం మానేశాడని, తన కుమార్తెను కూడా తనకు చూపించడం లేదని ఆమె పోలీసులకు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. తమ మామ తన భర్తకు రెండో పెళ్లి చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన భర్త నగరంలో పేరొందిన లాయర్ పేరు చెప్పి తననేమీ చేయలేరని బెదిరిస్తున్నాడని ఆమె కమిషనర్‌కు నివేదించింది. ఆమె ఫిర్యాదుపై స్పందించిన కమిషనర్ మహిళా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.