అక్రమాస్తులు : శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో రూ.2 కోట్లకు పైగా ఆస్తులు!
సైదాబాద్ సరస్వతి నగర్లోని ట్రాన్స్ కో ఏడిఈ శ్యాంసుందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ అధికారులు బుధవారం సోదాలు చేశారు. సోదాల్లో భారీగా బంగారం, డబ్బు, ఇళ్ల స్థలాల డాక్యుమెంట్లు బయటపడ్డాయి. శ్యాంసుందర్ రెడ్డి రూ. 20 కోట్లపైనే ఆస్తులు కూడబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మింట్ కంపౌండ్లో ఏడిఈగా విధులు నిర్వహిస్తున్న శ్యాంసుందర్ రెడ్డి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని గుర్తించిన ఏసిబి అధికారులు సైదాబాద్లోని ఆయన నివాసంలో బుధవారం ఉదయం నుంచి సోదాలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ. 2 కోట్లకు పైగా ఆయన అక్రమాస్తులు కలిగి ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
ఇదిలా ఉంటే.. కాగా, తమకున్న ఆస్తులన్నీ సక్రమమైనవనేనని శ్యాంసుందర్ రెడ్డి, ఆయన భార్య చెప్పారు. తమ వద్ద రూ. 20 కోట్ల ఆస్తులున్నాయనడం మీడియాకు సమంజసం కాదని తెలిపారు.
సోదాలు జరిగినంత మాత్రాన అవినీతిపరులని ఎలా అంటారని ప్రశ్నించారు. ఏసిబి అధికారులకు తప్పుడు సమాచారం అందడం వల్లే సోదాలు చేస్తున్నారని చెప్పారు. వారికి తాము సహకరిస్తున్నామని తెలిపారు. తన తండ్రి రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడని ఆయన నుంచి తనకు కొంత ఆస్తి వచ్చిందని శ్యాంసుందర్ రెడ్డి తెలిపారు.