చాక్లెట్ దొంగతనం చేశాడంటూ..బాలుడిపై పోలీసుల దాష్టీకం!
చాక్లెట్ దొంగతనం చేశాడని అనుమానంతో బాలుడిపై పోలీసులు దాష్టీకం ప్రదర్శించారు. చాక్లెట్ దొంగతనం చేశాడన్న అనుమానంతో వరంగల్ జిల్లా వర్ధన్నపేట పోలీసులు పదేళ్ల వయసున్న ఐదో తరగతి విద్యార్ధిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అంతేనా, రాత్రంతా పోలీస్ స్టేషన్లోనే ఉంచుకుని సదరు బాలుడి కాళ్లను మొద్దుకు కట్టేసి పైశాచికంగా ప్రవర్తించారు. వివరాల్లోకెళితే... వరంగల్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామానికి చెందిన పదేళ్ల బాలుడు వీరన్న, మండల కేంద్రంలోని ఎస్టీ బాలుర వసతి గృహంలో ఉంటూ ఐదో తరగతి చదువుతున్నాడు.
శనివారం మధ్యాహ్నం తోటి విద్యార్థులతో కలిసి, ఓ దుకాణం వద్దకెళ్లాడు. షాపులో వ్యక్తులు కనిపించకపోయేసరికి వారిని పిలుచుకుంటూ లోపలికెళ్లాడు. ఇంతలోనే ఓ తుంటరి విద్యార్థి దుకాణం షట్టర్ లాగేసి పరుగందుకున్నాడు. లోపల చిక్కుకున్న వీరన్న షట్టర్ను కొడుతూ కేకలేయడంతో పక్కనున్న వారితో పాటు దుకాణం యజమాని అక్కడికి వచ్చారు. దుకాణంలో చాక్లెట్ దొంగతనానికి వచ్చావని బాలుడిని దూషించిన యజమాని అతడి జేబులోని రూ.300 లాగేసుకోగా, ఓ చోటా రాజకీయ నేత బాలుడిని పోలీసులకు అప్పగించాడు.
అయితే బాలుడిని మందలించి వదిలేయాల్సింది పోయి, పోలీసులు అతడిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. విషయం తెలుసుకున్న వార్డెన్ వెళ్లినా బాలుడిని వదలలేదు. రాత్రంతా స్టేషన్లోనే ఉంచుకున్న పోలీసులు బాలుడి కాళ్లను పెద్ద మొద్దుకు కట్టేశారు. మార్నింగ్ వార్డెన్కు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.