మోడీ - వీర్రాజుపై మండిపాటు.. శివాజీకి బీజేపీ శ్రేణుల ఝులక్!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రిలో తెలుగు సినీ హీరో శివాజీకి బీజేపీ శ్రేణుల నుంచి అనుకోని తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్ర నేత సోము వీర్రాజుపై వ్యాఖ్యలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. శివాజీ బస చేసిన హోటల్ వద్ద ఉద్రిక్తత నెలకొంది.
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ, వీర్రాజుపై శివాజీ వ్యాఖ్యలు చేసినట్లు బీజేపీ నేతలు ఆరోపించారు. ఆదివారం రాజమండ్రిలో శివాజీ బస చేసిన షెల్టాన్ హోటల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు సంఘటనా ప్రదేశానికి చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.
శివాజీ బీజేపీపై అనవసరమైన, అర్థరహితమైన వ్యాఖ్యలు చేస్తున్నారని, మోడీతోపాటు వీర్రాజుపై కూడా వ్యాఖ్యలు చేస్తూ బీజేపీకి చెడ్డపేరు తీసుకువస్తున్నారని వారు ఆరోపిస్తూ శివాజీ క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో మీడియా సమావేశాన్ని అడ్డుకుంటామని, హోటల్ నుంచి బయటకు రానివ్వమని బీజేపీ కార్యకర్తలు హెచ్చరించారు.