బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 1 ఏప్రియల్ 2017 (02:11 IST)

చంద్రబాబు హైదరాబాద్‌ను వదిలిపెట్టింది ఆ దెబ్బతోనేనా? నిజమవుతున్న అనుమానాలు..

చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం తిరక్కముందే హైదరాబాద్‌ నుంచి తన ప్రభుత్వాన్ని ఖాళీ చేసి అమరావతికి తీసుకుని వెళ్లవలసిన అవసరం ఎందుకొచ్చిందనేది ఈ నాటికీ చిదంబర రహస్యమే. ఈ విషయంలో ఎవరు ఏ వాదనలు తీసుకొచ్చినా అనుమానాలు ఉంటూనే వచ్చాయి.

పదేళ్లపాటు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌తో సంబంధాన్ని కలిగి ఉండవచ్చని, ఈ పదేళ్లలోపు ఏపీలో కొత్త రాజధానిని నిర్మించుకోవాలని విభజన చట్టం స్పష్టంగా పేర్కొన్నప్పటికీ చంద్రబాబు ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం ఏర్పడి సంవత్సరం తిరక్కముందే హైదరాబాద్‌ నుంచి తన ప్రభుత్వాన్ని ఖాళీ చేసి అమరావతికి తీసుకుని వెళ్లవలసిన అవసరం ఎందుకొచ్చిందనేది ఈ నాటికీ చిదంబర రహస్యమే. ఈ విషయంలో ఎవరు ఏ వాదనలు తీసుకొచ్చినా అనుమానాలు ఉంటూనే వచ్చాయి. కానీ తెలంగాణ మంత్రి కేటీఆర్ ఈ విషయమై చేసిన పాసింగ్ కామెంట్ అందరి అనుమానాలనూ నివృత్తి చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. 
 
శుక్రవారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించిన కేటీఆర్  పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పనిలో పనిగా తెలంగాణ కాంగ్రెస్‌ను, టీటీడీపీని ఇతర పార్టీలను ఒక రేంజిలో తిట్టిపోశారు. కాంగ్రెస్‌ నాయకులు ఆనాడు ఆంధ్రా నాయకుల మోచేతి నీళ్లు తాగకుండా పనిచేసుంటే తెలంగాణకు ఈ రోజు ఈ గతి పట్టి ఉండేది కాదన్నారు. తెలంగాణలో మిగిలిపోయిన చోటామోటా టీడీపీ నేతలంతా ఉనికి కోసమే ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని‌.  టీడీపీలో మిగిలిపోయినవారు ఆ పార్టీని విడాలని పిలుపునిచ్చారు.
 
ఇదంతా ఫక్తు రాజకీయం అనుకోవచ్చు. పార్టీలు ఒకరిపై ఒకరు విమర్ళలు చేసుకోవడం సహజమే అనుకోవచ్చు. కానీ కాంగ్రెస్, టీడీపీలపై విరుచుకుపడుతున్న క్రమంలో కేటీఆర్ అలవోకగా చేసిన కామెంట్ ఇప్పుడు పాత గాయాలను, పాత జ్ఞాపకాలను మళ్లీ రేపుతోంది. పాత సందేహాన్ని మల్లీ కొత్తగా తీసుకొస్తోంది. కేటీఆర్ ఏమన్నారు. తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చిండని ఒక ఏక వాక్య ప్రకటన చేసిపడేశారు. పదేళ్లు హైదరాబాద్‌లో కొనసాగే అవకాశాన్ని చేతులారా వదులుకుని అంత సడన్‌గా చంద్రబాబు అమరావతి బాట ఎందుకు పట్టారన్నది ఇప్పటికే అధికారిక రహస్యంగానే ఉండిపోయింది. 
 
తెలంగాణ దెబ్బకు తట్టా బుట్టా సర్దుకుని పోవడం అంటే ఘోరమైన అవమానం, ఎదురు దెబ్బ తగిలిన పరిణామమే అని పిల్లవాడినైనా చెబుతారు. ఓటుకు నోట్లు కేసులో మావాళ్లు బ్రీఫ్డ్ మీ పలుకులతో చంద్రబాబు అడ్డంగా బుక్ కావడమే తెలంగాణ ఏపీ బంధం పుటుక్కన తెగిపోవడానికి కారణమని, ఇక ఒక్క క్షణం ఇక్కడున్నా తమ నివాసభవనాల్లోనూ, ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా వ్యక్తిగత అధికారిక రహస్యాలను తెలంగాణ ప్రభుత్వం ఇట్టే తెలుసుకుంటుందనే విషయంలో స్పష్టత వచ్చాకే చంద్రబాబు అంతటి ఆకస్మిక నిర్ణయం తీసుకుని అమరావతి బాట పట్టాడని ఆరోజే వార్తలు వచ్చాయి. 
 
సరిగ్గా ఆ వార్తలనే ఇప్పుడు తెలంగాణ సీఎం తనయుడు, మంత్రి కేటీఆర్ వ్యంగ్యం జోడించి చెప్పడం ఉన్న అనుమానాలను మరింతగా పెంచుతోంది. మనది కాని హైదరాబాద్‌లో ఎన్నాళ్లు ఉండాలి అనే సమాధానం అందరినీ సంతృప్తి పర్చదు. తెలంగాణ దెబ్బకు టీడీపీ అధినేత చంద్రబాబు, చిన్నబాబు తట్టా బుట్టా సర్దుకుని అమరావతికి మకాం మార్చిండని చెప్పడంలోనే ఓటుకు నోటు కేసులో బలమైన దెబ్బ తగిలే చంద్రబాబు హైదరాబాద్‌పై మక్కువను చంపుకున్నారని పలువురి భావన.
 
కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్న కన్నా చంద్రబాబు అంత సడన్‌గా హైదరాబాద్‍‌ను వదిలిపెట్టారు అన్నది ఇంకా ఉత్కంఠ కలిగించే విషయమం.. ఈ విషయంలో అధికారిక అంశాలు వెల్లడి కావు కాబట్టి అంతవరకూ ఇది అయివుండొచ్చు, అలా జరిగి ఉండొచ్చు అని ఊహాగానాలు తప్పవు కాబోలు.