మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pyr
Last Modified: శుక్రవారం, 24 ఏప్రియల్ 2015 (22:47 IST)

మస్తానా..! మజాకానా..!! అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్.. నగరాల్లో సినీ హీరోయిన్లతో ప్రేమాయణం

చేతి నిండా డబ్బులుండాలే కానీ కొండ మీది కోతినైనా దింపవచ్చుననే నగ్న సత్యాన్ని మస్తాన్ బాగా వంటబట్టించుకున్నాడు. రాత్రిళ్లు అడవుల్లో ఎర్రచందనం స్మగ్లింగ్ తెల్లారే సరికి తెల్ల దుస్తులతో నాయకుడిగా చెలామణి అవుతుంటాడు. ఇక పల్లెల్లో నాయకుడు. నగరాల్లో అడుగు పెట్టి హీరోయిన్లతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతుంటాడు. ఈ జల్సా పురుషుడికి నీతూ అగర్వాల్ దాసోహం అయినట్లు తెలుస్తోంది. హీరోయిన్ తో ఆయన తిరగని ఊరు లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను అరెస్టు చేసి కోర్టుకు అప్ప జెప్పిన పోలీసులు తాజాగా మరోమారు కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. 
 
కర్నూలు జిల్లా చాగలమర్రి మండలానికి చెందిన ఈ ఎర్రచందనం పురాణ పురుషుడు మొదటి నుంచి జల్సా రాయుడే. మస్తాన్ వలీ అదే మండలం ముత్యాలపాడులో మొదటి భార్యతో సంసారం పెట్టాడు. అనంతరం మరో మహిళను పెళ్ళి చేసుకున్నాడు. ఇతగాడి వ్యవహారం చూసిన ఆమె ఇతనికి గుడ్ బై చెప్పేసినట్లు తెలుస్తోంది. అప్పటికే గ్రామం, మండల స్థాయిలో నాయకుల వెంట తిరిగే మస్తాన్ కు ఎలాగైనా డబ్బు సంపాదించాలనే కోరిక పుట్టింది. ఇక ఎర్ర కూలీలను వెంటేసుకుని అడవి బాట పట్టాడు. అక్కడ నుంచి ఎర్రచందనం అక్రమ తరలింపునకు శ్రీకారం చుట్టాడు. ఏడాది తిరగకుండానే చేతి నిండా డబ్బు వాహనం, మంచి ఇల్లు వచ్చి పడ్డాయి. 
 
ఇక మనోడికి సినిమా తీయాలనే కోరిక పుట్టింది. అంతే నీతూ అగర్వాల్ ను హీరోయిన్ గా పెట్టి  ''ప్రేమ ప్రయాణం'' పేరిట సినిమా తీశాడు. నష్టం వచ్చింది.  ఎర్రచందనం అక్రమ రవాణాతో పోగైన కోట్లాది డబ్బులు రావడంతో మస్తాన్ వలికి సినీమా నిర్మాణంలో వచ్చిన నష్టాలను పెద్దగా పట్టించుకోలేదు. తాను తీసిన చిత్రంలో హీరోయిన్ గా నటించిన నీతూ అగర్వాల్ ను పటాయించాడు. ఆమెతో చెట్టాపట్టాలేసుకుని దేశ విదేశాలు తిరిగేశాడు. ఆమెకు హైదరాబాద్ లో ఓ ప్రేమమందిరం(ప్లాటు), కారు, బైకు కొనిచ్చాడు. అదే ప్రేమమందిరంలో ఆమెతోనే సహజీవనం సాగిస్తూ ఉండేవాడని తెలిసింది.  
 
ఇక తన ప్రాంతంలో నాయకుడిగా చెలామణి అవుతూనే ఉన్నాడు. ఇంతలోనే శేషాచలం ఎన్ కౌంటర్ జరిగింది. ఇదే ఈ జల్సా రాయుడి భాగోతాన్ని  బయటపడింది. ఇటీవలే ఎర్రచందనం దుంగలను తరలిస్తూ శిరివెళ్ల పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ అతడిని విచారించిన సందర్భంగా పోలీసులకు చిక్కాడు విచారణంలో ఈ భాగోతాలన్నీ బయటపడ్డాయి. జైల్లో ఊచలు లెక్కెడుతున్న అతగాణ్ణి ఈ పర్యాయం అనంతపురం పోలీసులు కోర్టు అనుమతితో తమ కస్టడీలోకి తీసుకున్నారు. వారి కోటింగ్ లో ఏమేమి బయటకు కక్కుతాడో చూడాల్సిందే. 
 
మరోవైపు తన ప్రియురాలు, హీరోయిన్ అయిన నీతూ అగర్వాల్ అకౌంట్ నుంచి ఎర్రచందనం స్మగ్లర్లకు అమౌంట్ బదిలీ అయినట్లు గుర్తించారు. ఆమె ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె కోసం కూడా పోలీసు గాలిస్తున్నారు.