శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 24 మార్చి 2017 (18:10 IST)

ప్రత్తిపాటి పుల్లారావు చిన్నచీమ... ఐనా కొట్టేశారు చూడండి... జగన్ మోహన్ సాక్ష్యాలు

అగ్రిగోల్డ్ పైన ఏపీ అసెంబ్లీ గత రెండు రోజులుగా వాడివేడిగా రగులుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం శుక్రవారం నాడు జగన్ మోహన్ రెడ్డి పైన తీర్మానం చేసే వరకూ వెళ్లింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన ఆరోపణలు రుజువు చేస్తే ఆయనను అసెంబ్లీ నుంచి వెలివేస్త

అగ్రిగోల్డ్ పైన ఏపీ అసెంబ్లీ గత రెండు రోజులుగా వాడివేడిగా రగులుతున్న సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం శుక్రవారం నాడు జగన్ మోహన్ రెడ్డి పైన తీర్మానం చేసే వరకూ వెళ్లింది. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పైన ఆరోపణలు రుజువు చేస్తే ఆయనను అసెంబ్లీ నుంచి వెలివేస్తామని, ఒకవేళ ఆ ఆరోపణలను జగన్ రుజువు చేయలేకపోతే ఆయనను సభ నుంచి వెలివేస్తామంటూ తీర్మానం చేశారు. కాగా అంతకుముందే సభ నుంచి వైసీపి వాకౌట్ చేసింది. 
 
అనంతరం విజయవాడలో జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అగ్రిగోల్డ్ గురించి నేను మాట్లాడుతుంటే... స్పీకర్ వ్యాఖ్యల వ్యవహారాన్ని తీసుకొచ్చి టాపిక్ డైవర్ట్ చేశారన్నారు. ఇంకా జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. " అగ్రిగోల్డ్ గురించి నేను 20 నిమిషాలు మాట్లాడుతా. సాక్ష్యాలు చూపిస్తానంటే మైక్ కట్ చేశారు. అసెంబ్లీలో గద్దలకు సపోర్ట్ చేస్తున్నారు.
 
నాకు ఛాలెంజ్ చేస్తున్నారు. కానీ అంతకుముందు నేను చేసిన ఛాలెంజ్‌లకు చంద్రబాబు నాయుడు ఎందుకు స్వీకరించలేదో తెలియదు. అగ్రిగోల్డ్ సంస్థ 20 లక్షల మందికి టోపీ పెట్టింది. వేల కోట్ల రూపాయలు మింగేశారు. అతిపెద్ద స్కాం. ఈ కుంభకోణంలో అగ్రిగోల్డ్ బాధితుల ఆస్తులను గద్దల్లా తన్నుకుపోయినవారు చాలామంది వున్నారు. మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఒక చిన్నచీమ. పెద్దచీమలు చాలా వున్నాయి.
 
చాలామంది పెద్ద మనుషుల చేతుల్లో ఇరుక్కున్న అగ్రిగోల్డ్ ఆస్తులు రాబట్టాలి. ప్రతిపక్ష నాయకుడిగా నేను చేస్తున్నదాన్ని చంద్రబాబు నాయుడు ఆసక్తిగా విని చర్యలు తీసుకోవాల్సింది పోయి నేను కానీ ప్రత్తిపాటి పుల్లారావు కానీ వుండాలంటారు. నాకూ ప్రత్తిపాటికి మధ్య వైరం ఏంటి.? నేను అడుగుతున్నది అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయమని. నన్ను వెలివేయాలంటూ తీర్మానం చేశారు. అసలు చంద్రబాబుకు మెదడు వుందా లేదా అని అడుగుతున్నా.
 
21 మంది మా పార్టీ వాళ్లను తెదేపాలోకి తీసుకుని కండువాలు కప్పారు. వారితో రాజీనామా చేయించి గెలిపించుకోవాలని ఎన్నోసార్లు ఛాలెంజ్ చేశా. మరి ఆ ఛాలెంజ్ ఎందుకు తీసుకోలేదు. ఆయనకు నచ్చినదాన్నే సవాలుగా తీసుకుంటారు. నోటుకు ఓటు కేసులో ఛాలెంజ్ చేశా. ఆ ఛాలెంజ్ తీసుకోరు. టాపిక్‌ను ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు? హాయ్ ల్యాండ్ ఎటు పోయిందో ఎవరికి తెలుసు.
 
ఉదయ్ దినకర్ అనే వ్యక్తి అగ్రిగోల్డ్ సంస్థ డైరెక్టర్. ఆయన 2010 నుంచి వున్నారు. ఈయనే హాయ్ ల్యాండ్ డైరెక్టర్ కూడా. ఈ పెద్దమనిషి దినకర్, ప్రత్తిపాటి పుల్లారావు భార్య వెంకాయమ్మకు 19-01-2015 నాడు భూములు అమ్మారు. ఇంతకన్నా సాక్ష్యాలు ఇంకేం కావాలి. సేల్ డీడ్ కనబడుతున్నా ఇంకా ఆధారాలు కావాలా? నన్ను ప్రూవ్ చేయమంటారు? నేనేమైనా పోలీసోడ్నా, సీబీఐ అధికారినా...? విచారణకు ఆదేశిస్తే సంబంధిత అధికారులు విచారణ చేసి నిజం రాబడుతారు. ఇవన్నీ చెప్పాలనుకుంటే స్పీకర్ నా మైక్ కట్ చేస్తారు. చంద్రబాబు నాపై సవాల్ విసురుతారు. తీర్మానాలు చేస్తారు..." అంటూ జగన్ మోహన్ రెడ్డి చెప్పారు.