గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ivr
Last Modified: శుక్రవారం, 9 అక్టోబరు 2015 (13:30 IST)

రాజమౌళి, బోయపాటి, తోట తరణిలను రంగంలోకి దింపిన చంద్రబాబు...? ఎందుకంటే...?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని శంకుస్థాపన వేడుకలు సాదాసీదాగా కాదు... తోట తరణి డిజైన్లతో, బాహుబలి డైరెక్టర్ రాజమౌళి క్రియేటివిటితో అందరినీ ఆకట్టుకునేలా ఉండాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అనుకుంటున్నారట. అందుకే అమరావతి రాజధాని శంకుస్థాపన జరిగే చోట వేదిక ఎలా ఉండాలనే విషయంతో పాటు అక్కడి మిగిలిన ప్రాంతాలను కనువిందుగా ఎలా తీర్చిదిద్దాలన్న విషయాలపై క్రియేటివ్ ఐకన్స్ తో చర్చించాలని అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.
 
ఇందులో భాగంగా ప్రముఖ కళాదర్శకుడు తోట తరణి, క్రియేటివ్ డైరెక్టర్ రాజమౌళి, బోయపాటి శ్రీనుల సూచనలు, సలహాలు తీసుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు ఆఘమేఘాలపై వారి సలహాల కోసం వెళ్లినట్లు సమాచారం. రాజధాని నిర్మాణానికి 32 వేల ఎకరాలను కట్టబెట్టిన రైతులకు కృతజ్ఞతలు తెలుపుతూ నృత్యాలతో కూడిన పాటలను రాయించాలని కూడా సీఎం సూచించినట్లు తెలుస్తోంది. మొత్తమ్మీద రాజధాని శంకుస్థాపన కార్యక్రమాన్ని దేశం ఆసక్తిగా తిలకించేలా తీర్చిదిద్దాలని సీఎం అధికారులను పురమాయించినట్లు సమాచారం.