బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : ఆదివారం, 20 జులై 2014 (16:09 IST)

నెల్లూరు జెడ్పీ ఎన్నికల్లో ధర్మానిదే విజయం : అంబటి

నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎన్నికల్లో ధర్మం, న్యాయానిదే విజయమని వైకాపా అధికార ప్రతినిది అంబటి రాంబాబు అన్నారు. ఆదివారం జరిగిన ఈ పరోక్ష ఎన్నికల్లో జెడ్పీ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను లాటరీ విధానం ద్వారా వైకాపాకు దక్కిన విషయం తెల్సిందే. దీనిపై అంబటి రాంబాబు మాట్లాడుతూ... నెల్లూరు జిల్లా పరిషత్ ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నికల్లో న్యాయమే గెలిచిందన్నారు.
 
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నెల్లూరు జిల్లాలో 31 స్థానాలను గెలుచుకున్న తమ పార్టీ, పూర్తి మెజార్టీ సాధించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అయితే అధికార పక్షం కుట్రలు పన్ని జడ్పీ పీఠాన్ని దక్కించుకునేందుకు యత్నించిందని ఆరోపించారు. ఈ క్రమంలోనే తమ పార్టీ తరఫున గెలిచిన ఎనిమిది మంది జడ్పీటీసీలను తమవైపు తిప్పుకుని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందన్నారు. అయితే అనేక ఊహించని పరిణామాల మధ్య జరిగిన ఎన్నికలో గెలుపు తమనే వరించిందని ఆయన పేర్కొన్నారు. దీంతో ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలిచ్చిన టీడీపీకి తగిన గుణపాఠం నేర్పినట్లైందని ఆయన చెప్పారు.