శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 26 నవంబరు 2015 (11:08 IST)

రెండున్నర దశాబ్దాల తర్వాత సొంత గూటికి ఆనం బ్రదర్స్.. ముహుర్తం ఖరారు

నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న ఆనం సోదరులు తిరిగి సొంతగూటికి చేరుకోనున్నారు. అదీ కూడా రెండున్నర దశాబ్దాల తర్వాత పసుపు చొక్కా ధరించనున్నారు. ఇందుకోసం డిసెంబర్ ఐదో తేదీని ముహుర్తంగా ఖరారు చేశారు. వివాదాస్పద ప్రకటనలకేకాకుండా, ముక్కుసూటిగా మాట్లాడే సీనియర్ ఆనం వివేకానంద రెడ్డి నిత్యం వార్తల్లో ఉంటే, సౌమ్యుడిగా ముద్రపడిన జూనియర్ ఆనం రాంనారాయణరెడ్డి చడీచప్పుడు లేకుండా పనులు చక్కబెడతారన్న పేరుంది. ప్రస్తుతం వీరి రాజకీయ భవిష్యత్ అంధకారంలో పడింది. రాష్ట్ర విభజన ఫలితంగా వీరు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. దీంతో తిరిగి సొంత గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలెట్టి.. అవి సఫలీకృతమయ్యేలా చేసుకున్నారు. 
 
నిజానికి వీరిద్దరు స్వర్గీయ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించిన సమయంలో ఆ పార్టీలో వీరు చేరిపోయారు. ఆ తర్వాత కొన్నాళ్లకే అక్కడ పడక, ఆ పార్టీకి వీడ్కోలు చెప్పి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అలా 25 ఏళ్ల పాటు వారు కరుడుగట్టిన కాంగ్రెస్ నేతలుగా చెలామణి అవుతూ వచ్చారు. ముఖ్యంగా దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఆనం బ్రదర్స్‌కు మంచి గుర్తింపు వచ్చిందని చెప్పొచ్చు. ఆయన కేబినెట్‌లో ఆనం రామనారాయణ రెడ్డి కీలక భూమిక పోషించారు. 
 
వైఎస్ అకాల మరణం తర్వాత రోశయ్య కేబినెట్లో ఆర్థిక మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన ఆ తర్వాత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్‌లోనూ అదే పదవిలో కొనసాగారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోగా, ఆనం బ్రదర్స్‌కు కూడా ఓటమి తప్పలేదు. దీంతో పార్టీ కార్యక్రమాలకు కూడా దూరమైన ఆనం బ్రదర్స్ తిరిగి సొంత గూటికి చేరేందుకు నిర్ణయించుకున్నారు. వీరి చేరికకు టీడీపీ అధినేత నారా చంద్రబాబు సూత్రప్రాయంగా అంగీకరించడమేకాకుండా, వారికిచ్చే పార్టీ పదవులను కూడా ఖరారు చేశారని సమాచారం. పైగా వీరు సైకిల్ ఎక్కే ముహుర్త తేదీని డిసెంబర్ 5గా ఖరారు చేశారు. ఆ రోజునే వీరికి పార్టీ పదవులు కూడా కట్టబెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.