బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 27 నవంబరు 2015 (16:25 IST)

ప్రజా సేవ చేయకుండా ఉండలేక పోతున్నాం.. అందుకే తెదేపా గూటికి : ఆనం బ్రదర్స్

తాము ప్రజాసేవ చేయకుండా ఉండలేక పోతున్నామని, అందుకే అధికార తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్టు నెల్లూరు జిల్లాకు చెందిన ఆనం బ్రదర్స్ వెల్లడించారు. అంతేకానీ, పదవీ వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం లేదని వారు చెపుతున్నారు. కాగా, కరుడుగట్టిన కాంగ్రెస్‌వాదులుగా ముద్రపడిన ఆనం బ్రదర్స్ టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్న విషయంతెల్సిందే. తమ పార్టీ మార్పుపై ఆనం వివేకానంద రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డిలు మీడియాతో మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం రెండుగా విడిపోయి, రాజధానిని నిర్మించుకునే దశలో ఉందన్నారు. ఇప్పటి నుంచి అందరూ సహకరిస్తేనే మరో 10 - 15 సంవత్సరాల్లో బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయని ఆనం చెప్పారు.
 
ఆ సామాజిక బాధ్యతతోనే తెదేపాలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. పదవుల కోసం రాజకీయాలు చేయకూడదని, బిడ్డల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయాలని ఆనం సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవాలన్నదే తమ అభిమతమన్నారు. గెలుపోటములతో సంబంధం లేకుండా ప్రజలతో కలిసి పనిచేశామన్నారు. ప్రజా సేవే తమ లక్ష్యమని, అందుకే చంద్రబాబుతో కలవాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అంతేకానీ, పదవుల కోసం పార్టీలో చేరడం లేదన్నారు.