గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 ఫిబ్రవరి 2016 (18:17 IST)

వైకాపా.. ఓ టైటానిక్ నౌక.. బంగాళాఖాతంలో మునిగిపోతుంది : ఆనం జోస్యం

వైఎస్. జగన్ మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ సీపీ ఒక టైటానిక్ నౌక వంటిందని, అది త్వరలోనే బంగాళాఖాతంలో మునిగిపోతుందని టీడీపీ నేత ఆనం వివేకానంద రెడ్డి జోస్యం చెప్పారు. టీడీపీ మునిగిపోయే నావ వంటిదని వైకాపా ఎమ్మెల్యే ఆర్కే. రోజా చేసిన వ్యాఖ్యలపై ఆనం శుక్రవారం ఘాటుగానే స్పందించారు.
 
వైకాపా త్వరలో బంగాళాఖాతంలో కలిసిపోవడం ఖాయమన్నారు. ప్రస్తుతం జగన్‌ పరిస్థితి టైటానిక్‌ షిప్‌లా తయారైందని ఎద్దేవా చేశారు. జగన్‌ పెడుతున్న ఇబ్బందుల కారణంగా వైకాపా నుంచి 10 ఎమ్మెల్యేలు త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి చేరనున్నారని ఆయన తెలిపారు. ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో అసాంఘిక శక్తిలా తయారవుతున్నాడని ఆనం ఆరోపించారు. 
 
ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే సత్తా చంద్రబాబు నాయుడికి తప్ప మరెవ్వరికీ లేదని స్పష్టం చేశారు. అక్రమాస్తుల కేసులో ఏ క్షణంలోనైనా జగన్ జైలుకెళతారని జోస్యం చెప్పారు. ఆయనను నమ్ముకున్నవాళ్లంతా నట్టేట మునుగుతారని జగన్ అనుచరులను ఆనం హెచ్చరించారు.