గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శనివారం, 20 ఏప్రియల్ 2019 (12:53 IST)

ప్రేమించి పెళ్లి చేసుకుని చంపేశాడు.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించి చిక్కాడు...

జిల్లా కేంద్రమైన అనంతపురం శివారు ప్రాంతంలోని సుశీల రెడ్డి కాలనీలో జరిగిన ఓ హత్య కేసులోని ఓ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న కట్టుకున్న భర్తే కాలయముడయ్యాడు. పక్కా ప్లాన్‌తో హత్య చేసి, ఆ తర్వాత ప్రమాదంలో చనిపోయినట్టుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అనంతపురం నగరశివారులోని సుశీల రెడ్డి కాలనీకి చెందిన సరోజ (28) అనే మహిళ రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన జగదీశ్వర రెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కులాల అడ్డు గోడులను కూల్చి తొమ్మిది నెలల క్రితం ఒక్కటయ్యారు. 
 
రెండుమూడు నెలలవరకు సక్రమంగా వీరి కాపురం జరిగింది. ఆ తర్వాతే వారి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. చిన్న చిన్న మనస్పర్ధలు చోటుచేసుకోసాగాయి. కానీ చిన్న చిన్న గొడవలను పెద్దవిగా తీసుకున్న జగదీశ్వర రెడ్డి పక్కా ప్లాన్ ప్రకారం భార్యను చంపాలని ప్లాన్ చేశాడు. 
 
ఈ క్రమంలో యాక్సిడెంట్‌గా చిత్రీకరించి భార్యను చంపేయాలని భావించిన జగదీశ్వర రెడ్డి బైక్‌పై భార్యను ఎక్కించుకుని శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో రొడ్డుపై కింద పడేశాడు. కిందపడిన తర్వాత ఆమె తలపై బలంగా కొట్టి జగదీశ్వర రెడ్డి కిరాతకంగా సరోజను చంపేశాడు. ఆ తర్వాత జగదీశ్వర రెడ్డి 108 వాహనంలో అనంతపురం ఆస్పత్రికి చికిత్స చేయించుకునేందుకు వెళ్లాడు. 
 
లారీ ఢీ కొట్టడంతో భార్య చనిపోయిందని పోలీసులకు చెప్పాడు. అయితే అనుమానం వచ్చిన పోలీసులు జగదీశ్వర రెడ్డిని గట్టిగా విచారించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. మృతురాలి తండ్రి ప్రభుదాస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి జగదీశ్వర్ రెడ్డిని అరెస్టు చేశారు.