శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 18 జులై 2019 (19:41 IST)

సీఎస్‌ను కలిసిన ఆంధ్రా, తెలంగాణా సబ్ ఏరియా మేజర్ జనరల్

ఆంధ్రా, తెలంగాణా సబ్ ఏరియా మేజర్ జనరల్ ఎన్.శ్రీనివాసరావు (జనరల్ ఆఫీసర్ కమాండింగ్) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యంను కలిశారు. ఈ మేరకు గురువారం అమరావతి సచివాలయంలో మేజర్ జనరల్ సిఎస్ ను కలిశారు. 
 
ఈ భేటీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విడివడిన నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న ఉమ్మడి ఆంధ్రా సబ్ ఏరియాను విభజించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక సబ్ ఏరియాగా ఏర్పాటు చేయాల్సి ఉందని అందుకు గతంలో రక్షణశాఖ ప్రతిపాదించిన ప్రకారం అవసరమైన భూమిని త్వరితగతిన సమకూర్చాలని సిఎస్ సుబ్రహ్మణ్యంకు ఆయన విజ్ణప్తి చేశారు. 
 
రాజధాని ప్రాంతంలో అనువైన భూమిని ప్రభుత్వ ధరలకు అనుగుణంగా రక్షణ శాఖకు అప్పగిస్తే త్వరితగతిన ఆంధ్రా సబ్ ఏరియాను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని మేజర్ జనరల్ శ్రీనివాసరావు సిఎస్ కు చెప్పారు. కృష్ణా జిల్లాల్లో సుమారు 12 వేల మంది వరకూ ఎక్స్ సర్వీస్ మెన్లు ఉన్నారని వారందరికీ ఎక్స్ సర్వీసెస్ కంట్రీబ్యూటరీ హెల్త్ స్కీమ్ కింద అవసరమైన ఉచిత వైద్య సేవలు అందించడం జరుగుతోందని ఆయన సిఎస్‌కు వివరించారు. 
 
భేటీలో రక్షణ శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించాల్సిన తోడ్పాటు తదితర అంశాలపై మేజర్ జనరల్ శ్రీనివాసరావు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యంతో చర్చించారు. భేటీలో కల్నల్ కార్తికేయ, కమాండర్ బివిఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.