శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 8 జూన్ 2017 (11:37 IST)

భగవంతుడు ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నా : చంద్రబాబు

పోలవరం జాతీయ ప్రాజెక్టు విషయంలో భగవంతుడు ఆదేశించినట్టుగానే ముందుకు సాగుతున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. రాసిపెట్టి వుంది కాబట్టే ఇంత త్వరగా పనులు ముగింపు ఘట్టానికి చేరుకున్నాయని, అనుకున్న సమయానికన్నా ముందుగానే ప్రాజెక్టులో నీటిని నిల్వ చేసి చూపిస్తానని అన్నారు. 'నేను ఓపెన్‌గా చెబుతున్నా. పోలవరం కార్యక్రమాన్ని పూర్తి చేసే పనిలో మనం ముందున్నాం. ఐయాం వెరీ హ్యాపీ. భగవంతుడు ఆదేశించాడు. డెస్టినీ నిర్ణయించింది. ఆ పని మనం పూర్తి చేసే పరిస్థితికి వచ్చాం' అన్నారు. 
 
రెండు రోజుల నాటి వర్షాలకు అమరావతిలోని వైఎస్.జగన్ కార్యాలయంలోకి వర్షపు నీరు రావడంపై మీడియా ప్రశ్నించగా, "అది సీబీసీఐడీ విచారణలో ఉంది కదా?. విచారణ కానివ్వండి. నేను ఏమంటున్నానంటే, ఈ రోజుల్లో తప్పుడు ప్రచారం చేయడం అంత మంచిది కాదు. ఈ పవిత్రమైన స్థలంలో చిన్న చిన్న విషయాలు మాట్లాడటం కరెక్టు కాదు. ఇది ఒక పెద్ద యజ్ఞం. ఇక్కడ ఆ మాటలు వద్దు. ఓకే... థ్యాంక్యూ" అంటూ తన మీడియా సమావేశాన్ని చంద్రబాబు ముగించారు. 
 
కాగా, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కనీసం 20 నుంచి 30 సంవత్సరాల పాటు సాగాలన్నది వైకాపా అధినేత వైఎస్ జగన్ ఆశయమని, అందుకోసమే అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు తన హయాంలోనే పూర్తవుతుందని, పనులను వేగంగా చేసేందుకు అధికారులు కృతనిశ్చయంతో ఉన్నారని, నిధులకు ఎంతమాత్రమూ కొరతలేదని, నాణ్యతతో పనులు సాగుతున్నాయన్నారు.