శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : మంగళవారం, 20 డిశెంబరు 2016 (14:08 IST)

కరెన్సీ కష్టాలు కొంపముంచేలా ఉన్నాయ్.. ఆలోచన చేస్తే తల బద్దలవుతోంది: చంద్రబాబు

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో కోటీశ్వరులు, నల్లధన కుబేరులు మినహా అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కరెన్సీ కష్టాలు ర

దేశంలో పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయంతో కోటీశ్వరులు, నల్లధన కుబేరులు మినహా అన్ని వర్గాల ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ కరెన్సీ కష్టాలు రెండు మూడు రోజుల్లో సర్దుకుంటాయని కేంద్ర ప్రభుత్వంతో పాటు.. భారత రిజర్వు బ్యాంకు ప్రకటించింది. కానీ, ఒకటిన్నర నెల కావస్తున్నా సమస్య పరిష్కారం కాలేదు కదా కష్టాల ఎక్కువైపోతున్నాయి. 
 
ప్రజలు పడుతున్న కరెన్సీ కష్టాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోమారు స్పందించారు. పెద్ద నోట్ల రద్దు తరువాత, ప్రజల అవస్థలు చూస్తుంటే తల బద్దలవుతోందన్నారు. నవంబర్‌తో పోలిస్తే, డిసెంబర్‌లో కష్టాలు మరింతగా పెరిగాయన్న భావన ప్రజల్లో ఉందని, తక్షణం సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
 
విజయవాడలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మనసువిప్పి మాట్లాడిన ఆయన, నోట్ల రద్దు స్వాగతించాల్సిన అంశమని చెబుతూనే, ప్రజలు అవస్థలు పడకుండా చూడాల్సిన బాధ్యత కేంద్రంతో పాటు బ్యాంకర్లపైన కూడా ఉందని, వారు తమ పనిని నూరు శాతం సంతృప్తికరంగా చేస్తున్నట్టు కనిపించడం లేదని అన్నారు. నోట్ల రద్దు జరిగిపోయి నెలన్నర గడుస్తున్నా, ప్రజలింకా బ్యాంకుల్లో క్యూలైన్లలో నిలబడటం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు.
 
తక్షణం సమస్యను పరిష్కరించే మార్గం కూడా తనకు కనిపించడం లేదన్నారు. ఇది తీవ్ర హాని చేకూర్చేలా ఉందన్నారు. ఆర్బీఐ నుంచి మరింతగా నగదు నిల్వలు బ్యాంకులకు రావాల్సివుందన్నారు. ప్రజలకు చాలినంత చిల్లర ఇవ్వాల్సిన అవసరం ఉందని, ఈ మేరకు రూ.500, రూ.100 కొత్త నోట్లను ఇవ్వాలని ఇప్పటికే కోరామన్నారు. నగదు రహిత లావాదేవీలకు ఏపీ ప్రభుత్వం పూర్తిగా మద్దతిస్తోందని, ఇప్పటికే ఈ-పోస్ యంత్రాలను విరివిగా సరఫరా చేశామని గుర్తు చేశారు.