శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 22 అక్టోబరు 2014 (10:08 IST)

తెలంగాణాకు 300 మెగావాట్ల విద్యుత్ ఇస్తాం : చంద్రబాబు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కోరినపక్షంలో ఆ రాష్ట్రానికి 300 మెగావాట్ల విద్యుత్‌ను సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ తెలంగాణలో కరెంట్ కష్టాలకు తానే కారణమని టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు ప్రచారానికి పాల్పడుతోందని మండిపడ్డారు. ముందు చూపుతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకోకుండా తనపై విమర్శలు చేస్తే తెలంగాణ ప్రజల కష్టాలు తీరవని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం 300 మెగావాట్ల విద్యుత్ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
 
విద్యుత్ ఉత్పత్తి వల్ల శ్రీశైలంలో నీళ్లు పూర్తిగా తగ్గిపోయాయని...ఇలాగైతే ఎండాకాలంలో తాగడానికి ఇరు రాష్ట్రాల ప్రజలకు నీళ్లు ఉండవని... ఈ ఉద్దేశంతోనే, శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని తెలంగాణ ప్రభుత్వానికి సూచించానన్నారు. దీనికి ప్రతిఫలంగా ఆంధ్రప్రదేశ్ నుంచి 300 మెగావాట్ల కరెంట్‌ను తెలంగాణకు ఇవ్వడానికి తాను సంసిద్ధత వ్యక్తం చేశానని చెప్పారు.ఓ మంచి ఉద్దేశంతో ఈ ప్రతిపాదన చేస్తే, తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తోందని టీఆర్ఎస్ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తూ, తమ పార్టీ కార్యాలయాలపై దాడులకు పాల్పడుతున్నారని, ఇదెక్కడి న్యాయమన్నారు.