గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 24 నవంబరు 2014 (10:15 IST)

చంద్రబాబు కేబినెట్‌ నుంచి ఆ ముగ్గురుకి ఉద్వాసన లేదా స్థానచలనం!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రివర్గం నుంచి ముగ్గురు మంత్రులకు ఉద్వాసన లేదా స్థానచలనం పలికే అవకాశం ఉన్నట్టు ఊహాగానాలు వస్తున్నాయి. మంత్రుల పనితీరును ఎప్పటికప్పుడు బేరీజు వేస్తున్న చంద్రబాబు... పని తీరును మెరుగుపరుచుకోవాలంటూ హెచ్చరికలు జారీ చేస్తున్న విషయం తెల్సిందే. 
 
అయినప్పటికీ.. ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెళ్ల కిషోర్ బాబులు చంద్రబాబు ఆశించిన వేగాన్ని అందుకోలేక పోతున్నారు. దీంతో వారికి ఉద్వాసన లేదా స్థానచలనం తప్పదనే సంకేతాలు పంపినట్టు సమాచారం. 
 
ముఖ్యంగా.. ప్రత్తిపాటి పుల్లారావు తన శాఖకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కూడా పొందలేకపోతున్నారనే భావనలో చంద్రబాబు ఉన్నారు. హోంమంత్రి చినరాజప్ప విషయానికి వస్తే... ఆయన ఇంతవరకు తన శాఖపై పట్టు సాధించలేకపోయారని, సమర్థవంతంగా పని చేయలేకపోతున్నారని సమాచారం. కాగా, బీజేపీతో టీడీపీ సంబంధాల విషయంలో కొద్ది రోజుల క్రితం కిషోర్ బాబు చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించడమే కాక, రాజకీయంగా పెద్ద చర్చను లేవనెత్తాయి. ఈ నేపథ్యంలో, వీరి శాఖలలో మార్పులు తథ్యమని తెలుస్తోంది.