శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : గురువారం, 2 ఏప్రియల్ 2015 (11:00 IST)

నవ్యాంధ్ర రాజధానిగా అమరావతి ఎందుకంటే....

ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా అమరావతి పేరును ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. అమరావతి పేరునే ఎంపిక చేయడానికి, ఖరారు చేయడానికి, ప్రకటించడానికి గల కారణాలను కూడా ఆయన వివరించారు. చారిత్రకంగా, పౌరాణికంగా, ఆధ్యాత్మికంగా ఏ రకంగా చూసినా నూతన రాజధాని విజయవాడ - గుంటూరు మధ్యలో వస్తుందని... నూతన రాజధానికి అమరావతి అని పేరు పెడితే బాగుంటుందని... దీనిపై సుదీర్ఘంగా చర్చ జరిగిందని... ఈ పేరు చాలా బాగుంటుందని అందరూ ఏకగ్రీవంగా ఆమోదించిన తర్వాతే ఏపీ రాజధాని పేరు అమరావతిగా నిర్ణయించినట్లు ఆయన వివరించారు. 
 
శాతవాహనుల రాజధానిగా 400 సంవత్సరాలకు పైగా దీనికి గుర్తింపు వచ్చిందన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో పంచారామాలలో ఒకటైన అమరేశ్వర ఆలయం, ఈ పేరు మీదగానే అమరావతి వచ్చిందని పురాణాలు చెపుతున్నాయన్నారు. అమరావతికి చారిత్రక, పౌరాణిక వైభవం ఉందని, ఇంద్రుడు పాలించిన నగరంగా అమరావతికి పేరుందని, ఇన్ని ప్రఖ్యాతలు ఉన్న అమరావతిని ఏపీ రాజధానిగా నిర్ణయించడం జరిగిందన్నారు. ఒక మోడ్రన్ సిటీగా, అందరికీ అనుకూలంగా రాజధాని నిర్మాణం చేయాలని అనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు.