మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : మంగళవారం, 22 జులై 2014 (16:19 IST)

కృష్ణా - గుంటూరు మధ్యే రాజధాని : మంత్రి నారాయణ!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త రాజధాని కృష్ణా - గుంటూరుల మధ్య ఏర్పాటయ్యే అవకాశాలు ఉన్నట్టు రాష్ట్ర మంత్రి పి నారాయణ మంగళవారం చేసిన వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. కొత్త రాజధానికి కృష్ణా, గుంటూరు మధ్య ప్రాంతమే సరైన స్థలమని తాము శివరామకృష్ణన్‌ కమిటీ ముందు ప్రస్తావించినట్లు ఆయన చెప్పుకొచ్చారు. 
 
ఢిల్లీలో కమిటీ సభ్యులను కలిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడలో అతిపెద్ద రైల్వే జంక్షన్, విమానాశ్రయం, నదీజలాలు, నాలుగు లేన్ల రోడ్లు అన్నీ అందుబాటులో ఉన్నాయని ఆయన అన్నారు. శివరామకృష్ణన్ కమిటీని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈనెల 26న కలుస్తారని, వారికి సమర్పించాల్సిన ముసాయిదా నివేదికను కూడా సిద్ధం చేశారని నారాయణ చెప్పారు. 
 
కొత్త రాజధానికి సుమారు 20 వేల ఎకరాలు అవసరమని, రాబోయే మూడు నెలల్లో ఆ 20 వేల ఎకరాల భూమిని గుర్తిస్తామని తెలిపారు. ఆయా రంగాలలో నిపుణులతోనే కొత్త రాజధాని కోసం కమిటీ ఏర్పాటుచేశామని, మరో సాంకేతిక కమిటీని కూడా ఏర్పాటుచేస్తున్నామని నారాయణ చెప్పారు.