గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : బుధవారం, 27 ఫిబ్రవరి 2019 (14:05 IST)

కీచక టీచర్‌ను చితక్కొట్టిన కూలీలు...

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓ కీచక టీచర్‌ను చితక్కొట్టారు. 14 యేళ్ళ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడినందుకు స్థానికులు దేహశుద్ధి చేశారు. విశాఖపట్టణం జిల్లా చీడికాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన చీడికాడ పోలీసు స్టేషన్‌ పరిధికి చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక పాఠశాలకు వెళ్లేందుకు బస్సు కోసం బస్టాండులో ఒంటరిగా నిలబడివున్నది. ఆ సమయంలో అటుగా వచ్చిన పాఠశాల ఉపాధ్యాయుడు(40) ఒకరు లిఫ్ట్ ఇస్తానని నమ్మించి, బైకుపై ఎక్కించుకున్నాడు. 
 
కొంతదూరం వెళ్లాక.. నిర్మానుష్య ప్రాంతానికి బైకును నడుపుకుంటూ వెళ్ళాడు. అక్కడ ఆ బాలికపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఉపాధ్యాయుడి ప్రవర్తనకు భయపడిన ఆ బాలిక గట్టిగా కేకలు వేయడంతో చేయి చేసుకున్నాడు. అయితే, ఆ బాలిక కేకలు విన్న రైతులు, కూలీలు ఒక్క పరుగున ఘటనా స్థలికి చేరుకున్నారు.
 
ఆ బాలిక ఏడుస్తూ జరిగిన సంఘటనను వారికి వివరించింది. దీంతో ఆగ్రహించిన రైతులు, కూలీలు ఉపాధ్యాయుడిపై దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు పట్టించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.