మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శుక్రవారం, 25 అక్టోబరు 2019 (11:15 IST)

ఆంధ్రప్రదేశ్ లో మరో 'సీపెట్' కేంద్రాన్ని నెలకొల్పాలి: మేకపాటి గౌతమ్ రెడ్డి

కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం, సూరంపల్లిలో ‘సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ప్లాస్టిక్స్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ’, ‘సెంటర్‌ స్కిల్లింగ్‌ అండ్‌ టెక్నికల్‌ సపోర్ట్‌’ (సీపెట్‌–సీఎస్‌టీఎస్‌) నూతన భవన సముదాయాన్ని ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో కలిసి కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి డీవీ సదానందగౌడ గురువారం ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి హాజరైన పరిశ్రమలు, వాణిజ్య. ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ సాహసోపేత నిర్ణయాలకు చిరునామాగా మారిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందడుగు వేస్తోందన్నారు. ప్రతి పౌరునికి పారదర్శక పాలన అందించి సంక్షేమ పథకాలను ప్రతి పౌరుని ఇంటికి అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా సీఎం జ‌గ‌న్ నడిపిస్తున్నారన్నారు.

రాష్ట్రాభివృద్ధిలో కేంద్రం సహకారం కీలకం. రాబోయే రోజుల్లో నవ్యాంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి పూర్తి సహాయసహకారాలు అందనున్నాయని మంత్రి మేకపాటి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని యువతకు , ముఖ్యంగా స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు  అందించడం కోసం ప్రభుత్వం నైపుణ్య కేంద్రాలను ఏర్పాటుకు శ్రీకారం చుట్టిందన్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేసి, యువతకు ఉద్యోగవకాశాలను పెంచేందుకు అవసరమైన రూట్ మ్యాప్ కోసం టాస్క్ ఫోర్స్ కమిటీని ఏర్పాటు చేసినట్లు మంత్రి వెల్లడించారు.

అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతను ఇస్తూ జిల్లాలన్నింటిలో 25 స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లను ఏర్పరచనున్నామని మంత్రి అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేయబోతున్నామని చెప్పడానికి గర్వపడుతున్నట్లు మంత్రి తెలిపారు. సీపెట్.. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలతో భాగస్వామ్యమై అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ముందుకురావాలని కోరుతున్నామన్నారు మంత్రి. సీపెట్ తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో సాటిలేని విధంగా అవతరిస్తుందని మంత్రి తెలిపారు.

ఈ సందర్భంగా సీపెట్ గురించి కొన్ని విషయాలను మంత్రి  పంచుకున్నారు. 1968లో చెన్నైలో తొలి సీపెట్ ప్రారంభమైన నాటి నుంచి ప్లాస్టిక్ టెక్నాలజీకి పర్యాయపదంగా నిలిచిందన్నారు. ఇప్పటికే  దేశవ్యాప్తంగా 36 సీపెట్ సెంటర్లు ఏర్పాటు కాగా..మరో ఐదు కేంద్రాలను ప్రారంభించేందుకు సమాయత్తమవుతుందని మంత్రి వెల్లడించారు.

ఇప్పటివరకూ టెక్నాలజీ అభివృద్ధి, యువతను ప్రపంచస్థాయి కార్మిక శక్తిగా మలచడం, పరిశోధన రంగాలలో  సీపెట్ కీలక పాత్ర పోషిస్తున్నట్లు స్పష్టం చేశారు. ఈశాన్య మధ్యభారతదేశం, ఆఫ్రికా దేశాలలో ప్లాస్టిక్ పరిశ్రమలకు  పంచస్థాయి సేవలను అందించడంలో  సీపెట్ పాత్ర మరవలేనిదని మంత్రి వ్యాఖ్యానించారు. విజయవాడ సీఎస్టీఎస్, ఇతర రాష్ట్రాల ఏజెన్సీలతో సీపెట్ భాగస్వామ్యం అవడం మంచి పరిణామమని మంత్రి మేకపాటి అన్నారు.

సీపెట్ తో భాగస్వామ్యం కావడం వల్ల ఏజెన్సీలకు మేలు జరుగుతుందన్నారు. వివిధ పథకాల రూపంలో రాష్ట్రానికి కేంద్రం అందిస్తున్న ప్రోత్సాహం, సహకారం వల్ల ఇప్పటికే రాష్ట్రంలోని యువతకు  ఎన్నో వినూత్న కోర్సులు అందించి శిక్షణ అందించి..వారి బంగారు భవిష్యత్ దిశగా తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి వెల్లడించారు. ఎంతో మంది ఈ కోర్సుల వల్ల లబ్ది పొందారన్నారు. 
 
దేశ ఆర్థిక వృద్ధిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర కూడా ఎంతో కీలకమైందని మంత్రి ఉద్ఘాటించారు. 5 లక్షల కోట్ల భారత ఆర్థిక వ్యవస్థలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయే రోజుల్లో తన వాటా స్థాయి పెంచుతుందని మంత్రి స్పష్టం చేశారు. ఆటో మొబైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్ట్ టైల్స్ , ఎలక్ట్రానిక్ రంగాలలో  సీపెట్ కు అపార అవకాశాలున్నాయని మంత్రి వెల్లడించారు.

ప్లాస్టిక్ టెక్నాలజీలోనూ సీపెట్ తనదైన ముద్ర వేయనుందన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్లాస్టిక్ ను నిషేధించాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్న తరుణంలో ప్లాస్టిక్ రీసైక్లింగ్‌లో సీపెట్ ప్రధాన పాత్ర పోషించి ప్రధాని ఆశయ సాధనకు ఎంత‌గానో దోహదపడుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశముంటే ఏపీలో మరో సీపెట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి సదానందగౌడకు సభాముఖంగా మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన తెలుగు బిడ్డ, కేంద్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి రాఘవేంద్రరావు రాష్ట్రాభివృద్ధికి అందించే సహకారంలో ప్రత్యేక చొరవ చూపాలని మంత్రి కోరారు. రూ.50 కోట్ల వ్యయంతో, 12 ఎకరాల్లో సంస్థను ఏర్పాటు చేయగా, అందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెరి రూ.25 కోట్లు చొప్పున వెచ్చించాయి. సంస్థను ప్రారంభించిన అనంతరం అక్కడ ఒక మొక్క నాటిన కేంద్ర మంత్రి డీవీ సదానందగౌడ, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆ తర్వాత ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనను తిలకించారు.

కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వెల్లంపల్లి శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి, ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయభాను, ఎమ్మెల్యేలు కె.పార్థసారథి, మల్లాది విష్ణు, రక్షణనిధి, ఎం.జగన్మోహన్‌రావు, కైలా అనిల్‌కుమార్,  ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రమణ్యం, పలువురు అధికారులు  పాల్గొన్నారు.