మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By JSK
Last Modified: సోమవారం, 2 మే 2016 (21:12 IST)

చీమ‌ల వ‌ల్లే శిశువు మృతి... కాదు రాజ‌కీయం చేస్తున్నారంటున్న మంత్రి

విజయవాడలోని ప్రభుత్వ పిల్లల ఆసుపత్రిలో శిశువు మృతి వివాదాస్ప‌దంగా మారింది. ఆసుపత్రిలోని ఉయ్యాలలో చీమలు గమనించని సిబ్బంది ఆ ఉయ్యాల‌లో బాబును ఉంచడంతో ... చీమలు కుట్టి శరీరమంతా పుండ్లు పడి చనిపోయాడు.  గుంటూరు జిల్లా పెనుమాకకు చెందిన ఆటో డ్రైవర్ అంజయ్య తన భార్య లక్ష్మిని ప్రసవం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చాడు. నాలుగు రోజుల కిందట ఆమెకు సిజేరియన్ చేయడంతో మగ శిశువు జన్మించాడు. 
 
అయితే గత రాత్రి ఉయ్యాలలో వున్న శిశువును చీమలు కుట్టడంతో శిశువు పొట్ట, వీపు భాగాల్లో గాయాలయ్యాయి. తెల్లవారగానే శిశువు మరణించాడు. అయితే వైద్యులు మాత్రం ఊపిరితిత్తుల సంబంధ వ్యాధితో బాలుడు చనిపోయినట్లు చెబుతున్నారు. మృతదేహన్ని మార్చురీకి తరలించారు. అయితే కొంద‌రు వైసీపీ నేత‌లు ఆ శిశువు మృతదేహాన్ని తెప్పించి ప్ర‌భుత్వాసుప‌త్రి ఎదుట ధ‌ర్నా చేయ‌డం వివాదాస్ప‌దం అయింది.
 
ప్రభుత్వాన్నిఅప్రదిష్టపాలు చేయడానికి కొందరు శిశువు మృతిని రాజకీయం చేస్తున్నారు : మంత్రి కామినేని
 
లండన్ :  ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తూ, విషం చిమ్ముతున్న కొన్ని రాజకీయ పార్టీలకు చెందిన కొందరు నేతలు చనిపోయిన శిశువును ఆసుపత్రికి తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నార‌ని మంత్రి కామినేని శ్రీనివాస్ పేర్కొంటున్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులతో  విచారణ చేయిస్తామన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం రిపోర్టును తెప్పించుకొని తప్పు జరిగి ఉంటే భాద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి కామినేని అన్నారు. బాలుడి శ‌వంతో ధర్నాకు కూర్చున్న నేతలు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.