గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : మంగళవారం, 28 జులై 2015 (11:38 IST)

నిజమైన భారతరత్నగా సేవలందించిన కలాం.. చంద్రబాబు సంతాపం

భారతరత్న, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపట్ల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారతరత్నగా గౌరవాన్ని అందుకున్న కలాం నిజమైన భారతరత్నగా దేశానికి సేవలందించారని కీర్తించారు. దేశం కోసం ఆయన చేసిన సేవలను మరువలేమన్నారు. గతంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, తదుపరి రాష్ట్రపతిగా ఎవర్ని ఎంపిక చేయాలి? అంత గొప్ప వ్యక్తి ఎవరు ఉన్నారు? అని కేంద్రం ఆలోచిస్తున్న తరుణంలో... అప్పటి ప్రధాని వాజ్ పేయికి కలాం పేరును తాను సూచించాని చంద్రబాబు తెలిపారు. 
 
ఆ విధంగా కలాం రాష్ట్రపతి కావడానికి చేయూతంగా ఉన్నందుకు గర్విస్తున్నామన్నారు. ఆ తర్వాత రాష్ట్రపతి పదవిని చేపట్టి, ఆ పదవికే వన్నె తెచ్చిన వ్యక్తి కలాం అని చెప్పారు. తాను చనిపోతే సెలవు ప్రకటించవద్దని చెప్పారు. వీలైతే మరో రోజు ఎక్కువ పనిచేయండని కలాం చెప్పారని గుర్తుచేసుకున్నారు. అలిపిరి ఘటనలో తాను గాయపడినప్పుడు, రాష్ట్రపతి హోదాలో ఉన్నప్పటికీ తనను కలాం పరామర్శించారని చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు. ఆ విషయాన్ని తాను ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పారు. 
 
కలాం అంత్యక్రియలు ఆయన స్వగ్రామంలో జరుగుతుండడంతో చంద్రబాబు నాయుడు బుధవారం ఉదయం రామేశ్వరంకు వెళతారని సమాచారం తెలిపారు. చంద్రబాబుతో పాటు కొందరు రాష్ట్ర మంత్రులు కూడా వెళ్ళతారని తెలుస్తోంది. కాగా రామేశ్వరం కలాం స్వగ్రామం కాబట్టి కేంద్ర ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు ఇక్కడ జరగనున్నాయి.