బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సిహెచ్
Last Modified: బుధవారం, 10 అక్టోబరు 2018 (20:04 IST)

గుంటూరు కలెక్టర్ కోన శశిధర్‌కు ముఖ్యమంత్రి ఘన సన్మానం.. ఎందుకు?

అనంతపురం జిల్లాలో కరువును తరిమివేయడానికి లక్ష పంట కుంటలు త్రవ్వించడంలో విశేష కృషి చేసిన ప్రస్తుత గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్‌ను సన్మానించి అభినందించారు ముఖ్యమంత్రి  నారా చంద్రబాబు నాయుడు. 2015 సంవత్సరంలో అనంతపురం జిల్లాలో కలెక్టరుగా కోన శశిధర్ పని చేస్తున్న సమయంలో ముఖ్యమంత్రి నీరు - ప్రగతి కార్యక్రమంలో భాగంగా రాయదుర్గం నియోజకవర్గం గుమ్మగట్టు మండలం భైరవాని తిప్ప ప్రాజెక్ట్ వద్ద అనంతపురం జిల్లాలో తొలి పంట కుంట త్రవ్వకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. 
 
ఆ సమయంలో ఆయన మాట్లాడుతూ అనంత జిల్లాలో కరువును పారద్రోలాలంటే పంట కుంటలే శరణ్యమని, తద్వారా భూగర్భ జలాలు పెంపొండమే కాక, ఆ పొలానికి సంపూర్ణంగా నీరు అంది వ్యవసాయాభివృద్దికి ఎంతో ఉపయుక్తంగా వుంటుందన్నారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో అప్పుడు అనంతపురం జిల్లా కలెక్టరుగా వున్న కోన శశిధర్, 16 నెలల కాలంలోనే 70 వేల పంట కుంటలు త్రవ్వించి ఘనతను సాధించారు. మిగిలిన 30 వేల పంట కుంటలు ప్రస్తుత అనంతపురం జిల్లా కలెక్టర్ పూర్తి చేయడంతో ముఖ్యమంత్రి సలహాలు, సూచనలు, ఆలోచనలు కార్యరూపం దాల్చాయి.
 
ముఖ్యమంత్రి రెండున్నర సంవత్సరాల క్రితం మొదటి పంట కుంటను ప్రారంభించిన ప్రాంతమైన భైరవాని తిప్ప ప్రాజెక్ట్ సమీపంలోనే లక్ష ఒకటవ పంట కుంటను త్రవ్వించిన సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో దాదాపు 70 వేల పంట కుంటలు అతి తక్కువ కాలంలో త్రవ్వించి అనంతపురం జిల్లా రైతులు కరువు బారిన పడకుండా కృషి చేసిన అప్పటి అనంతపురం జిల్లా ప్రస్తుత గుంటూరు జిల్లా కలెక్టరు కోన శశిధర్‌ను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి అనంతపురం జిల్లాలో జరిగే ఈ కార్యక్రమానికి పిలిపించుకుని తన చేతుల మీదుగా ఘనంగా సత్కరించి ప్రశంసా పత్రం అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమం అనంతరం కలెక్టర్ కోన శశిధర్ భైరవాని తిప్ప ప్రాజెక్ట్ ప్రాంతాన్ని కలియతిరిగి తన కృషి వలన నీరు లభ్యత వచ్చిన ప్రాంతాన్ని చూసి ఆనందం వ్యక్తం చేసారు.
  
ఈ కార్యాక్రమంలో మంత్రులు దేవినేని ఉమా మహేశ్వరావు, శ్రీమతి పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు, ఎం.పి జే.సి. దివాకర్ రెడ్డి, పలువురు యం.యల్.ఎలు, యం.యల్.సి లు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.