శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 15 మార్చి 2019 (14:10 IST)

వైఎస్.వివేకా మృతిపై సమగ్ర దర్యాప్తు : సీఎం చంద్రబాబు ఆదేశం

తన ఇంటిలోని బాత్రూమ్‌లోపడి చనిపోయిన మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై సమగ్ర దర్యాప్తునకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. ఆయన మృతిపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్న దరిమిలా... నిజాలను నిగ్గు తేల్చేందుకు వీలుగా ఆయన సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. 
 
మరోవైపు, వివేకా మృతిని దర్యాప్తు చేసేందుకు ప్రత్యేక బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసినట్టు కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ వెల్లడించారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ, అదనపు ఎస్పీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వివేకానందరెడ్డి మృతిపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తామన్నారు. ఫోరెన్సిక్ నిపుణులను ప్రత్యేకంగా రప్పిస్తున్నామని చెప్పారు. ఘటనా స్థలాన్ని క్లూస్ టీమ్, డాగ్ స్వాడ్ క్షుణ్ణంగా పరిశీలించిందని తెలిపారు. మృతి వెనుక ఎవరి పాత్ర ఉన్నట్టు తెలిసినా... కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
 
మరోవైపు, వైఎస్. వివేకా మృతిపై వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డి మాట్లాడుతూ, తమమకెంతో ముఖ్యుడైన వివేకా మృతి చెందిన ప్రాంతంలో రక్తపు మడుగులు కనిపించడం దిగ్భ్రాంతికి గురి చేసిందన్నారు. ఆయన కుటుంబ సభ్యులమంతా దీనిపై లోతైన దర్యాఫ్తు జరపాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.
 
వైఎస్ జగన్ పులివెందులకు వెళుతున్నారని, వివేకా అంత్యక్రియలు ముగిసేంత వరకూ అక్కడే ఉంటారని చెప్పారు. తనకు అందిన సమాచారం ప్రకారం, వివేకా మృతి అనుమానాస్పదంగా కనిపిస్తోందని, అందువల్లే దర్యాప్తును కోరుతున్నామన్నారు. ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమా? లేక దీనివెనుక ఎవరైనా ఉన్నారా? అన్న విషయం పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తేలుతుందని, దానికోసమే వేచిచూస్తున్నామని చెప్పారు.