శుక్రవారం, 29 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 20 జులై 2019 (19:33 IST)

నేను ముఖ్యమంత్రిని చెబుతున్నా జరగదా?.. జగన్ విచిత్ర వాదన...

చట్టానికి, నిబంధనలకు విరుద్ధంగా వెళ్లే చంద్రబాబు మాజీ సీఎం అయ్యారని వైసీపి ముక్తకంఠంతో అపోజిషన్ పైన నిప్పులు చెరుగుతోంది. అయితే గురువింద చందంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు మంత్రులకు, అటు అధికారులకు మింగుడుపడక ఏం చెబితే ఎలా రియాక్టవుతారనే భయంతో వణికిపోతున్నారట.
 
అసెంబ్లీ సమావేశాలకు పక్కనపెట్టీ, మరీ జరిపిన క్యాబినెట్ సమావేశంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరు బయటకు రాకపోయిన.. ఇదే తీరు కొనసాగితే భవిష్యత్తులో ఎలాంటి విపరీత పరిణామాలను ఎదుర్కోవల్సి వస్తోందో అని గుటకలు మింగుతున్నారు. 
 
గురువారం ఉదయం జరిగిన క్యాబినెట్ సమావేశంలో జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత‌ క్యాబినెట్ అజెండాగా ఎనిమిది అంశాలు అనుకోగా తర్వాత వాటిని 22 అంశాలకు మారుస్తూ నిర్ణయం తీసుకొన్నారు. 
 
అంతా బాగుంది. తన మానిఫెస్టోలోని సంక్షేమ పథకాలన్నీ ఆచరణలో పెట్టాలనే ఆతృత, ఆరాటం సీఎంకు వున్నా కానీ ఆర్థికంగా పరిపుష్టి లేని ఖజానాను చూసుకోకుండా వాటిని అమలు చేయడం ఎలా అన్న దానిపై అధికారులు, మంత్రులు సందేహాలు వ్యక్తం చేయడంతో వారిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి తీవ్ర ఆవేశంతో ముఖ్యమంత్రి నేను చెబుతున్నా కానీ చేయరా అంటూ ఊగిపోవడంతో బిక్కమొహాలు వేయడం అందరి వంతుగా మారినట్లు సమాచారం.
 
ఇక క్యాబినెట్ అజెండాలో పరిశ్రమ శాఖలో ఉద్యోగ కల్పన అంశంలో ఏకంగా ఆ శాఖ మహిళా అధికారిపై సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రవర్తించిన తీరుతో కాబినెట్ సమావేశం అంతా పిన్ డ్రాప్ సైలెన్స్ అయ్యిందని అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. తన పాదయాత్రలో హామీల్లో భాగంగా స్థానికులకే 75% ఉద్యోగాలు ఇస్తానని మాట ఇచ్చారు జగన్.
 
అదే అంశం తాజా కాబినెట్ సమావేశంలో అటు అధికారులకు మంత్రుల పాలిట శాపంగా మారింది. గత మూడేళ్లుగా నియమించిన ఉద్యోగాల్లో స్థానికులు కాని వారెవరో చూసి, వారి స్థానంలో అర్హులైన స్థానికులకు ఉద్యోగాలు ఇచ్చేలా ఓ చట్టాన్ని తయారుచేసి త్వరగా అమలు చేయాలని కాబినెట్ సమావేశంలో సీఎం ఆదేశించారు. అయితే ఆ శాక కార్యదర్శి ఉదయలక్ష్మి ఇది ఆచరణకు సాధ్యం కాదని, అలా చేస్తే కొత్తగా వచ్చిన ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చెప్పబోయారు. 
 
ఇంతలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఒక్కసారిగా ఆగ్రహంతో ఊగిపోతూ... అంటే నేను బయటకు ఇలా ఉద్యోగాలు ఇవ్వడం కుదరదూ.. మా ఉదయలక్ష్మి చెప్పే చట్టాలు, నిబంధనలు వల్ల మీకు ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పాలా అనడంతో ఒక్కసారిగా సమావేశంలో అందరు ముఖాలు తెల్లబోయాయని అధికారులు ఆవేదన వ్యక్తం చేసారు. 
 
అయితే సీఎం హామీ అమలు చేయడానికి ఇతర మార్గాలున్నాయని చీఫ్ సెక్రటరీ ఇతర అధికారులు సర్దిచెప్పడానికి ప్రయత్నించేలోగా తన చేతిలో వున్న పేపర్లను టేబుల్ పైన విసురుగా పడేసి అందరికి  చేతులెత్తి నమస్కారం పెడుతూ కాబినెట్ సమావేశంలో నుండి సీఎం జగన్ మోహన్ రెడ్డి బయటకు వెళ్లిపోవడంతో అధికారులు, మంత్రులు షాక్‌కి గురయ్యారని అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
ఇక అసెంబ్లీ జరుగుతున్న సమయంలో కాబినెట్ జరపటంలో తప్పులేదు కానీ ఆ విషయాన్ని ప్రోటోకాల్ ప్రకారం స్పీకర్‌కు, ప్రతిపక్షాలకు తెలపకుండా సమావేశం జరిపారు. దీంతో యథా ప్రకారం స్పీకర్ సమావేశాలను అనుకున్న సమయానికే ప్రారంభించేసారు. దీంతో ప్రభుత్వ తీరును ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీ నడిపే తీరుపై మండిపడటంతో ప్రభుత్వ పనితీరు, సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలతో ఏ క్షణాన ఏం జరుగుతుందోనన్న ఆందోళన అధికారుల్లోను.... ఇటు మంత్రులు ఎమ్మెల్యేలోను మొదలైందని అసెంబ్లీ లాబీల్లో చర్చించుకుంటున్నారు.