గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By శ్రీ
Last Modified: శుక్రవారం, 21 జూన్ 2019 (18:47 IST)

చంద్రబాబుకు నిన్న బీజేపీ.. నేడు వైసీపీ షాక్‌ల మీద షాక్‌లు..

చంద్రబాబు నాయుడుకి బీజేపీ, వైసీపీలు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నాయి. నలుగురు ఎంపీలు నిన్న భారతీయ జనతాపార్టీ తీర్థం పుచ్చుకుంటే, తాజాగా మరికొందరు మంది పార్టీ ఎమ్మెల్యేలు కమలం పార్టీలోకి దూకడానికి రెడీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా వైసీపీ మరో షాక్ ఇచ్చింది. 
 
ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి దగ్గరగా ఉండే ప్రజావేదిక క్యాంప్ కార్యాలయంలో ఈ నెల 24న జరగబోయే కలెక్టర్ల సదస్సును  నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఉండవల్లిలోని తన నివాసం సమీపంలో ఉండే ప్రజావేదిక ప్రాంగణాన్ని తమకు  కేటాయించాలని చంద్రబాబు గతంలోనే ఏపీ ప్రభుత్వాన్ని కోరారు. పార్టీ అధినేతగా సమావేశాలు ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందని... ఇందుకోసం ప్రజావేదిక ప్రాంగణాన్ని కేటాయించాలని కోరారు. 
 
జగన్‌కు ప్రత్యేకంగా లేఖ రాశారు. చంద్రబాబు రాసిన లేఖపై వైసీపీ నేత విజయసాయి రెడ్డి తీవ్రంగా విమర్శించారు కూడా. అయితే ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు సరికాదా ప్రజావేదిక ప్రాంగణాన్ని స్వాధీనం చేసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించడంతో టీడీపీ నేతలకు షాక్ తగిలింది. ఇప్పటికే ప్రజా వేదికను గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు పరిశీలించారు. ప్రభుత్వం ముందుగా కలెక్టర్ల  సదస్సును సచివాలయం 5వ బ్లాక్‌లో నిర్వహించనుందని ప్రచారం సాగినా.. చివరి నిమిషంలో ప్రజా వేదికకు మారడంతో ఇదంతా ఉద్దేశ్య పూర్వకంగానే జరుగుతుందని విమర్శిస్తున్నారు తెలుగుదేశం నేతలు.