గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: మంగళవారం, 6 జూన్ 2017 (19:01 IST)

మద్యం కల్తీ చేస్తే లైసెన్స్ రద్దు... ఆదాయం రూ.3,900 కోట్లు.... ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్

అమరావతి: మద్యాన్ని కల్తీ చేస్తే ఆ షాపు లైసెన్స్ రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాల్లో జరిగే మోసాలను అరికట్టే

అమరావతి: మద్యాన్ని కల్తీ చేస్తే ఆ షాపు లైసెన్స్ రద్దు చేయమని ఆదేశాలు ఇచ్చినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి కె.ఎస్.జవహర్ చెప్పారు. సచివాలయం 4వ బ్లాకు పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం మధ్యాహ్నం ఆయన మాట్లాడారు. మద్యం అమ్మకాల్లో జరిగే మోసాలను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. గతంలో మద్యం కల్తీ చేసినా, బ్రాండ్ మిక్సింగ్ చేసినా ఫైన్ విధించి వదిలివేసేవారని, ఇక ముందు లైసెన్స్ రద్దు చేస్తారని హెచ్చరించారు. ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు మద్యం అమ్మితే పీడీ యాక్ట్ పెట్టమని అధికారులకు చెప్పినట్లు తెలిపారు.
 
సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా జూలై 1 నుంచి కొత్త మద్యం పాలసీని ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. కొత్త పాలసీకి సంబంధించిన అంశాలను ఈ రోజు అధికారులతో చర్చించినట్లు చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా షాపులు నిర్వహించే అంశం అధికారులతో చర్చించినట్లు తెలిపారు. కొత్త పాలసీ నియమనిబంధనలు రూపొందించిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చూపించి, ఆయన సూచనలు, సలహాలు తీసుకొని ఖరారు చేస్తామన్నారు. 
 
రాష్ట్రంలో గంజాయి, మాదకద్రవ్యాలను పూర్తి స్థాయిలో నియంత్రించేందుకు 32 చెక్ పోస్టులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఒరిస్సా సరిహద్దుల నుంచి సారా వచ్చే అవకాశం ఉందని, దానిని నిరోధిస్తామన్నారు. సారా రహిత రాష్ట్రంగా ప్రకటించడమే తమ లక్ష్యం అన్నారు. 
 
తను మంత్రి పదవి చేపట్టిన తరువాత 200లకు పైగా బెల్ట్ షాపులపై కేసులు పెట్టినట్లు తెలిపారు. నవ నిర్మాణ దీక్షను పురస్కరించుకుని నాటుసారా నిర్మూలనకు  నవోదయం కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు చెప్పారు. భవిష్యత్ లో ప్రజలను చైతన్యవంతులను చేయడానికి కళాజాతాలను కూడా నిర్వహిస్తామన్నారు. ఎక్సైజ్ రెవెన్యూని తమ ప్రభుత్వం ప్రధాన ఆదాయ వనరుగా చూడటంలేదన్నారు. తమకు టార్గెట్ కూడా ఏమీ లేదని చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఎక్సైజ్ ఆదాయం రూ.13,598 కోట్లని, అందులో పన్నులు పోను తమకు రూ.3,900 కోట్లు మిగిలిందని మంత్రి జవహర్ వివరించారు.
 
తమ నేత చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధిపథంలో పయనిస్తుందన్నారు. హామీల మేరకు ఎస్సీ,ఎస్టీ, బ్రాహ్మణ కార్పోరేషన్ వంటి వాటి ద్వారా అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. 24 గంటలు నిరంతరం విద్యుత్ సరఫరా చేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. అమరావతి నిర్మాణం - పోలవరం ప్రాజెక్ట్ లను సీఎం రెండు కళ్లుగా భావించి ఆనందాంధ్రప్రదేశ్ సృష్టించడానికి కృషి చేస్తున్నారని చెప్పారు.