ఏపీలో కరవు తీవ్రం... ఇంకుడు గుంతలు తవ్వే పనిలో నేతలు
ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేనంతగా ఈ వేసవిలో తాగునీటి ఎద్దడి ప్రారంభమైంది. ఎప్పుడూ కళకళ లాడుతూ, నీటితో నిండి ఉండే జలాశయాలు ఇపుడు నీరింకిపోయి.. భయం గొల్పుతున్నాయి. ఈ పరిస్థితికి భూగర్భ జలాలు కూడా లేకపోతే...ఇక తాగునీటికి గొంతెండిపోతుందని ప్రభుత్వం గ్రహించింది. ఇప్పటికైనా వచ్చే వర్షాకాలంలో నీటి పొదుపు కోసం, భూగర్భ జలాలు పెంపొందించేందుకు నేతలు జోరుగా ఇంకుడు గుంతలు తవ్విస్తున్నారు.
కృష్ణా జిల్లా గుడివాడ ఏరియా ఆసుపత్రిలో ఇంకుడు గుంతను మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. పలు రకాల కాలుష్యాల కారణంగా నేడు వర్షాలు కురవని దారుణ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వర్షాలు కురవని కారణంగా భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. రానున్న రోజుల్లో తాగేందుకు నీరు దొరికే అవకాశాలు సన్నగిల్లితున్నాయి.
ఈ పరిస్థితులన్నింటిని అంచనా వేసిన రాష్ట్ర ప్రభుత్వం భూగర్భ జలాలను పెంచేందుకు అవసరమైన మార్గాలను అన్వేషిస్తోంది. ఒకవైపు మొక్కలను విరివిగా పెంచేందుకు పెద్ద ఎత్తున కృషి చేస్తోంది. మరో వైపు మనుషులు వాడుకున్న నీటిని వృథా కాకుండ ఇంకుడు గుంతల నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది.. ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అందరూ కలిసి విజయవంతం చేయాలని నేతలు పిలుపునిస్తున్నారు.