గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 18 నవంబరు 2019 (16:03 IST)

ఇంగ్లీషు మీడియానికి - మతానికి ముడిపెడుతున్నారు : మంత్రి ఆదిమూలపు సురేష్

వైఎస్ఆర్‌ సిపి ప్రభుత్వంపై బురద చల్లే కుట్ర జరుగుతోందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ ఆరోపించారు. ముఖ్యంగా, ఇంగ్లీష్‌ మీడియంపై ఆంధ్రజ్యోతి విషం చిమ్ముతోందనీ, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చివరికి ఇంగ్లీష్ మాధ్యమాన్ని మతానికి ముడిపెట్టి విశ్లేషణ చేయడం దారుణమన్నారు. 
 
ఇదే అంశంపై ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ విద్యార్ధులకు ఇంగ్లీష్‌ మాధ్యమం అందించి, మత మార్పిడీ చేయాలని చూస్తున్నారని ఆంధ్రజ్యోతిలో విశ్లేషించారు. ఇంతకన్నా దుర్మర్గమైన రాతలు ఎక్కడైనా వుంటాయా? దీనిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
 
రాష్ట్రం నుంచి ఏటా రెండు లక్షల మంది విద్యార్ధులు విదేశాలకు వెడుతున్నారు. వీరంతా ఇంగ్లీష్‌ భాషలో ప్రావీణ్యం పొందినవారే.. వారిని కూడా మతం కోణంలో చూస్తారా? ప్రపంచమే ఓ కుగ్రామంగా మారుతోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంను అందుకుని రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు మంచి అవకాశాలను అందుకోవాలన్నారు. 
 
చైనా, జపాన్ దేశాలకు చెందిన వారు కూడా ఇంగ్లీష్‌ నేర్చుకుని అమెరికా, యూరోప్ దేశాల్లో అవకాశాలను పొందుతున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇంగ్లీష్ మాధ్యమంపై నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 6వ తరగతి వరకు ఇంగ్లీష్‌ మీడియం అమలు చేస్తున్నాం. ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం ఎందుకు అవసరమో ఇప్పటికే సిఎం వైఎస్‌ జగన్‌ స్పష్టంగా వివరించారు.
 
ముఖ్యమంత్రి తన ఆలోచనలను రాష్ట్రప్రజలకు విపులంగా వివరించారు. విద్యార్ధులు రాబోయే రోజుల్లో వారి నైపూణ్యాలను పెంచుకోవాలని సిఎం చెప్పారు. ఆంగ్ల బాషలో వారి పరిజ్ఞానంను పెంచుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నిర్ణయంపై విద్యార్ధులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీనిని వక్రీకరిస్తూ కొన్ని పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. 
 
రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం ఎస్టీలకు 39 శాతం, ఎస్సీలకు 49 శాతం, మైనార్టీలకు 62 శాతం మందికి మాత్రమే అందుబాటులో వుంది. ఈ వర్గాలు అధికశాతం ప్రభుత్వ పాఠశాల్లోనే చదువుకుంటున్నారు. వీరందరికీ ఇంగ్లీష్ మీడియంను అందించినట్లయితే వారి జీవితాల్లో గొప్ప మార్పు వస్తుంది. అలాగే ప్రపంచ వ్యాప్తంగా అనేక అవకాశాలను రాష్ట్రానికి చెందిన విద్యార్ధులు అందుకోగలరు. 
 
మన విద్యార్ధులకు పోటీ ప్రపంచంను తట్టుకునే విధంగా తర్ఫీదు ఇవ్వాలనేదే మా సంకల్పం. 2006లో దీనికి నాందిగా దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. సక్సెస్‌ స్కూళ్లను ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆరువేలకు పై చిలుకు ఇంగ్లీష్ మాధ్యమం స్కూళ్లు నడుస్తున్నాయి. మన రాష్ట్రంలో ప్రైవేటు, ప్రభుత్వ విద్యాసంస్థల్లో సుమారు 62 శాతం మంది ఇంగ్లీష్‌ మాధ్యమంలో చదువుతున్నారు. 
 
అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అందుబాటులో లేకపోవడం వల్ల ఈ శాతం తగ్గింది. దీనివల్ల లోబడ్జెట్‌ కాన్వెంట్లు, ప్రైవేటు స్కూళ్లు అధికశాతం విద్యార్ధులను నమోదు చేసుకుంటున్నాయి. రాష్ట్రంలోని అన్ని కార్పోరేట్‌ విద్యాసంస్థలు ఇంటరులో ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తున్నాయి. చైతన్య, నారాయణ, బాష్యం, తదితర కాలేజీల్లో ఆంగ్ల మాధ్యమంను చూపి ఇబ్బడి ముబ్బడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు.
 
అధిక ఫీజులు చెల్లించగలిగే వారికే ఇంగ్లీష్ మీడియం పరిమితం కాకూడదు. అందుకే ప్రభుత్వ పాఠశాల్లో ఆంగ్ల మాధ్యమంను ప్రవేశపెడుతున్నాం. దీనివల్ల మా ప్రభుత్వానికి అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఆంగ్ల మాధ్యమానికి అనుగుణంగా టీచర్లకు తర్ఫీదు ఇవ్వాలి. ఆంగ్ల మాధ్యమ సిలబస్‌‌ను సిద్దం చేసుకోవాలి. విద్యార్ధులను ఆంగ్ల బాషకు అనుగుణంగా వారిలో నైపూణ్యాలను పెంచాల్సి వుంది. 
 
అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో వసతులను మెరుగుపరచాలి. మనబడి నాడు-నేడు అనే కార్యక్రమాన్ని కూడా వీటికోసం అమలు చేస్తున్నాం. ఈ సవాళ్లను అధిగమిస్తూ... రాష్ట్రంలోని విద్యార్ధులకు మంచి భవిష్యత్తును అందించబోతున్నాం. ఒకవైపు మా ప్రభుత్వం ఇవ్వన్నీ చేస్తుంటూ... మరోవైపు మాపై కుహానా మేథావులు బురద జల్లుతున్నారు. నిన్నటి వరకు ఇసుక అంటూ దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు ఇసుక సమస్య లేకుండా పోవడంతో ఇంగ్లీష్ అంటూ గుండెలు బాదుకుంటున్నారు. 
 
 
ఇంగ్లీష్‌కు మతానికి ముడిపెట్టి తప్పుడు విశ్లేషణలు చేస్తున్నారు. ఇంగ్లీష్‌ బాష ఎంత అవసరమో మొదటి జనరేషన్‌ వ్యక్తులు సరిగ్గాచెప్పగలరు. ఆంగ్లంలో పరిజ్ఞానం లేక ఎటువంటి అవకాశాలను కోల్పోయారో వారు వివరించగలరు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు ఈ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. 

మంత్రివర్గం నుంచి మొదలు నామినేటెడ్ పదవులు, కాంట్రాక్టుల వరకు యాబై శాతం రిజర్వేషన్ ఇస్తున్నాం. దేశంలోనే వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ఇది. వీటిని జీర్ణించుకోలని శక్తులు ఇంగ్లీష్ మీడియంను కూడా వివాదాస్పదం చేస్తున్నాయని ఆరోపించారు.