ఎన్టీఆర్కి భారతరత్న.. పీవీకి స్మారక మందిరం: ఏపీ మంత్రివర్గం తీర్మానం
టీడీపీ వ్యవస్థాపకుడు, తెలుగు ప్రజల ఆరాధ్య నటుడు స్వర్గీయ ఎన్టీఆర్కు భారతరత్న ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిమండలి ఓ తీర్మానం చేసింది. ఈ మేరకు బుధవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సమావేశంలో తీర్మానం చేసింది.
ఈ మంత్రివర్గ సమావేశంలో మూడు కీలకమైన తీర్మానాలను ఆమోదించారు. వాటిలో ఒకటి నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్రానికి సిఫారసు చేయడం, రెండోది మాజీ ప్రధాని పీవీ నరసింహారావు స్మారకాన్ని ఢిల్లీలో ఏర్పాటు చేయాలని, మూడోది అమెరికా పర్యటనను విజయవంతంగా పూర్తి చేసుకున్న ప్రధాని నరేంద్రమోడీకి అభినందనలు తెలుపుతూ చేశారు.
అంతేకాకుండా, ట్యాంక్ బండ్ మీద ఆంధ్రప్రాంతానికి చెందిన వారి విగ్రహాలను తొలగించాలని కేసీఆర్ భావించడానికి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఖండించింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఉపకార వేతనాలు కూడా ఇవ్వాలని మంత్రివర్గం నిర్ణయించింది.