భవన నిర్మాణాలకు ఆన్లైన్ అనుమతులు... దేశంలోనే ఏపీ రికార్డ్!
విజయవాడ : ఏపీలోని 33 మున్సిపాలిటీలను అమృత్ నగరాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు తయారుచేశామని మంత్రి నారాయణ చెప్పారు. మొత్తం 800 కోట్లతో 2016-17 సంవత్సరానికి ప్రాధాన్యత క్రమంలో పనులు చేపడతామన్నారు. కేంద్రం నుంచి 400, రాష్ట్రం నుంచి 400 కోట్లు ఈ సంవత్సరం ఖర్చు పెట్టనున్నామని నారాయణ తెలిపారు.
కేంద్రం రూపొందించిన 28 ఇండికేటర్లలో మనం దేశంలోనే ఏ రాష్ట్రం చేయనట్టుగా 27 ఇండికేటర్స్ పూర్తి చేశామని, దేశంలోనే ఏ రాష్ట్రం చేయని వినూత్న కార్యక్రమాలు రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపట్టిందని వివరించారు. త్వరలో అన్ని మున్సిపాలిటీల్లో ఎల్.ఇ.డి వీధిదీపాలు అమర్చిన తొలి రాష్రంగా ఏపి నిలవనుందని మంత్రి చెప్పారు.
5.5 లక్షలకు గాను ఇప్పటికే 4.5 లక్షల వీధి దీపాలు అమర్చామని, దేశంలోనే బిల్డింగ్ ఆన్లైన్ అనుమతులు ఇచ్చే తొలి రాష్ట్రంగా ఏపి ఇప్పటికే రికార్డు సృష్టించిందని నారాయణ చెప్పారు. 5,893 మంది అప్లై చేస్తే 3,815 మందికి ఆన్లైన్లో అనుమతులు రెండు నిమిషాల్లోనే మంజూరయ్యాయని చెప్పారు.