బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 27 జనవరి 2020 (11:58 IST)

అమరావతి వద్దు - శాసనమండలి రద్దు :: ఒకే రాష్ట్రం.. ఒకే సభ

అమరావతి వద్దు - శాసనమండలి రద్దు, ఒకే రాష్ట్రం ఒకే సభ అంటూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మంత్రులు నినాదాలు చేశారు. సోమవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశంలో కొడాలి నాని, కె.కన్నబాబు వంటి వారు అమరావతి వద్దు - శాసనమండలి రద్దు, ఒకే రాష్ట్రం - ఒకే సభ అంటూ నినాదాలు చేశారు. 
 
అంతకుముందు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. ఈ మేరకు నిర్ణయం తీసుకుని శాసనసభలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు నినాదాలతో హోరెత్తించారు. 'అమరావతి రద్దు... శాసన మండలి రద్దు' అంటూ మంత్రులు నినదించారు. మరోవైపు.. ‘ఒకే రాష్ట్రం.. ఒకేసభ’ అంటూ మంత్రులు కొడాలి నాని, కురసాల కన్నబాబు నినాదాలతో హోరెత్తించారు. 
 
ఇదిలావుంటే శాసన సభావ్యవరాల సలహా సంఘం భేటీ ప్రారంభమైంది. శాసనమండలి రద్దు తీర్మానం.. శాసనసభ పొడిగింపుపై బీఏసీలో చర్చించనున్నారు. ఈ భేటీ అనంతరం ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాల్లో ‘శాసనమండలి రద్దు’ ప్రతిపాదన తీర్మానాన్ని శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టనున్నారు.
 
మంత్రివర్గ భేటీలో మండలి రద్దు చేస్తే పరిస్థితేంటి..? మండలిలోని పార్టీ నేతలకు ఎలా న్యాయం చేయాలి..? ఇలా అన్ని విషయాలపై నిశితంగా చర్చించిన తర్వాత కేబినెట్ ఈ నిర్ణయం తీసుకుంది. మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ జరగనుంది. 
 
చర్చ తర్వాత మండలి రద్దు తీర్మానాన్ని అసెంబ్లీ ఆమోదించనుంది. అనంతరం అసెంబ్లీ తీర్మానాన్ని కేంద్రానికి జగన్ సర్కార్ పంపనుంది. పార్లమెంట్‌లోనూ బిల్లు ఆమోదం పొందాలి. కేంద్రం ఒప్పుకుంటే మండలి రద్దయ్యే అవకాశం ఉంది. లేనిపక్షంలో మండలి యధావిధిగా కొనసాగే ఆస్కారం ఉంది.