శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By CVR
Last Updated : ఆదివారం, 19 ఏప్రియల్ 2015 (12:15 IST)

ఏపీ ఒలింపిక్ సంఘం వివాదం... మాదే నిజమైన ఎన్నిక.. గల్లా జయదేవ్ వెల్లడి..!

ఏపీ ఒలింపిక్స్ అసోసియేషన్ ఎన్నికలు అధికార పార్టీ టీడీపీ‌లో ఇద్దరు కీలక నేతల మధ్య అగ్గి రాజేశాయి. ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడిని తానంటే, కాదు తానేనంటూ గుంటూరు ఎంపీ, ప్రముఖ పారిశ్రామిక వేత్త గల్లా జయదేవ్, టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ చెప్పుకుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరువురు నేతల మధ్య విభేదాలు తార స్థాయికి చేరుకున్నాయి. ఈ వివాదంపై ఆదివారం ఉదయం గల్లా జయదేవ్ నోరు విప్పారు. తిరుపతి వేదికగా ఏప్రిల్ 4న జరిగిన ఎన్నికల్లో తాను అధ్యక్షుడిగా, పురుషోత్తం కార్యదర్శిగా ఎన్నికయ్యామని ఆయన ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ వెల్లడించారు. 
 
తిరుపతిలో తమను ఎన్నుకునేందుకు జరిగిన ఎన్నికలే నిజమైనవని ఆయన పేర్కొన్నారు. భారత ఒలింపిక్ సంఘం ప్రతినిధి సమక్షంలో నాటి ఎన్నిక జరిగిందని, అందుకే తమదే నిజమైన కార్యవర్గమని ఆయన వాదించారు.
 
కాగా ఆదివారం హైదరాబాదులోని బంజారా ఫంక్షన్ హాల్ లో ఏపీ ఒలింపిక్ అసోసియేషన్ భేటీ జరుగుతోంది. ఈ భేటీకి సీఎం రమేశ్ నేతృత్వం వహించనున్నారని విశ్వసనీయ సమాచారం. అయితే ఇప్పటికే అధ్యక్షుడిగా ఎన్నికైన గల్లా జయదేవ్ పరిస్థితి ఏమిటని ఆయన వర్గం నేతలు ప్రశ్నిస్తున్నారు. దీంతో నేటి భేటీపై రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది.