తెలంగాణా వాహనాలకు ఏపీ ఎంట్రీ ట్యాక్స్ : గరికపాడులో రూ.1.30 కోట్లు వసూలు!
తెలంగాణ రాష్ట్రం నుంచి ఏపీకి వచ్చే వాహనలపై కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఎంట్రీ ట్యాక్స్ విధించారు. ఇది శుక్రవారం అర్థరాత్రి నుంచి అమల్లోకి వచ్చింది. దీంతో కృష్ణా, గుంటూరు, పగో, కర్నూలతో పాటు జిల్లా సరిహద్దుల్లో ఉన్న చెక్ పోస్టుల్లో భారీ మొత్తంలో పన్ను వసూలవుతోంది.
ఇందులోభాగంగా కృష్ణా జిల్లా గరికపాడు చెక్పోస్టు వద్ద డీటీసీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాలకు పన్ను వసూలు చేశారు. గత అర్థరాత్రి నుంచి శనివారం ఉదయం వరకు 100కు పైగా ప్రైవేటు బస్సులు, 120 లారీలకు పన్నులు వసూలు చేశారు. తెలంగాణ రిజిస్ట్రేషన్ కలిగిన విజయవాడ ఎంపీ కేశినేని నానికి చెందిన కేశినేని ట్రావెల్స్ బస్సులకు సైతం పన్ను వసూలు చేశారు. ఫలితంగా గరికపాడు చెక్పోస్టు వద్ద రూ.1.30 కోట్ల పన్ను వసూలైంది.
అటు పగో జిల్లా జీలుగుమిల్లి చెక్పోస్టు వద్ద తెలంగాణ వాహనాల నుంచి రూ.1.82 లక్షల పన్ను వసూలు చేశారు. కర్నూలు జిల్లా పంచలింగాల చెక్పోస్టు వద్ద తెలంగాణ నుంచి వచ్చే వాహనాలకు ట్యాక్స్ వసూలు చేశారు. మరోవైపు అకస్మాత్తుగా పన్ను విధించారంటూ లారీ యజమానుల ఆందోళన దిగారు. రాత్రి 11:30కి వచ్చిన బస్సుల నుంచి కూడా పన్ను వసూలు చేశారంటూ బస్సు యజమానులు ఆందోళన చేపట్టారు.