బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 20 మే 2015 (13:57 IST)

ఏపీకి ప్రత్యేక హోదా : గుత్తా సుఖేందర్ వర్సెస్ రఘువీరా రెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించే అంశంపై ఏపీ, తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య అగ్గిరాజేశాయి. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తమ రాష్ట్రానికి నష్టమని టీపీసీసీకి చెందిన నల్గొండ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి వాదనను ఏపీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి తీవ్రంగా ఖండించారు. అంతేకాక గుత్తాపై పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి రఘువీరా ఫిర్యాదు చేశారు. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే... ఏపీకి ప్రత్యేక హోదా అవసరం లేదని గుత్తా వాదిస్తున్నారు. అంతేకాక ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణకు నష్టం వాటిల్లుతుందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే తెలంగాణలోని పరిశ్రమలన్నీ ఏపీకి తరలిపోతాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కారణంగా ఏపీకి ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యేక హోదా ఇవ్వవద్దని ప్రధాని నరేంద్ర మోదీకి గుత్తా ఏకంగా లేఖ రాశారు. 
 
ఈ విషయం తెలుసుకున్న ఏపీసీసీ చీఫ్ రఘువీరా గుత్తా చర్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఏమీటీ చెత్త రాతలు?' అంటూ నిలదీశారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే గుత్తాకు వచ్చిన నష్టమేంటని మండిపడ్డారు. అంతటితో ఆగని రఘువీరా పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి గుత్తాపై ఫిర్యాదు చేశారు. మరి ఇరు రాష్ట్రాల పీసీసీల మధ్య ఏర్పడ్డ ఈ తగవును సోనియా ఎలా పరిష్కరిస్తారో చూడాలి.