టీడీపీ మహానాడుకు భారీ ఏర్పాట్లు
రాష్ట్ర విభజన తర్వాత నిర్వహిస్తున్న తొలి మహానాడు కావడంతో... తెలుగు రాష్ట్రాలు విడిపోయినా తెలుగు ప్రజల మధ్య ఆత్మీయత చెక్కుచెదరలేదని నిరూపించే విధంగా రెండు రాష్ట్రాల సంస్కృతులు ఉట్టిపడేలా వేదికను సిద్ధం చేస్తున్నారు. వేదికకు ఒక వైపు తెలంగాణ చారిత్రక కట్టడం ఓరుగల్లు కోట, మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాజధాని ‘అమరావతి’, స్థూపం, గౌతమబుద్ధుడు ప్రతిమలతో తీర్చిదిద్దుతున్నారు.
వేదిక ముందు కూర్చున్న వారికి వేదికపైన ఉన్న నేతలందరూ కనిపించేలా తీర్చిదిద్దారు. వేదిక వెనుకవైపు ఎప్పటి లాగా ఫ్లెక్సీలు కాకుండా, తొలిసారిగా ఎల్ఈడీ లైట్లతో దేశంలోని అన్ని కులవృత్తులు, సామాన్యుల జీవన విధానం ప్రతిబింబించేలా 38 ఫొటోలు పెట్టడం వేదికకు హైలెట్గా నిలిచింది. దూర ప్రాంతాల నుంచి వచ్చే కార్యకర్తలు ఎండలకు ఇబ్బంది పడకుండా ఉపశమన, రాత్రి బస వసతులు కల్పిస్తున్నారు. మహానాడుకు వచ్చే సుమారు 40 వేల మంది కార్యకర్తలు టెంట్లో కూర్చొనే విధంగా విశాలమైన ప్రాంగణంలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఒకేసారి ఒక్కొక్క చోట రెండు వేల మంది తినే విధంగా ఆరు చోట్ల భోజన వసతి ఏర్పాట్లు చేశారు.
అన్ని ప్రాంతాల రుచుల మేళవింపుతో మెనూను తీర్చిదిద్దారు. తాపేశ్వరం నుంచి ప్రత్యేకంగా చేయించిన సుగర్లెస్ స్వీట్లతో పాటు, కాజాలు, పూతరేకులు, కారా, తెలంగాణలో ప్రాచుర్యం చెందిన కమ్మటి లడ్డులతో పాటు సకినాలు కూడా స్నాక్న్లో అందించనున్నారు. అన్నంలో కొత్త ఆవకాయ పచ్చడితో పాటు కూరలు, పులుసు, వేపుళ్లు, కారప్పొడులతో మెనూను తీర్చిదిద్దారు. రోజుకు దాదాపు 50 వేల మందికి భోజనం అందేలా అన్ని ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి కూడా కార్యకర్తలు ఈ మహానాడుకు హాజరుకానున్నారు.