శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 3 సెప్టెంబరు 2015 (14:56 IST)

సునీత Vs రోజా: గతం గుర్తు చేసుకో.. అప్పుడు వైఎస్.. ఇప్పుడు బాబా?

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యే రోజా, టీడీపీ మంత్రి పరిటాల సునీతల మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. వైసీపీ తరపున అవకాశం దొరికనపుడల్లా తెలుగుదేశం పార్టీపై ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై విరుచుకుపడే రోజాకు.. పరిటాల సునీత కౌంటరిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా సభలో రోజా మాట్లాడుతూ దివంగత టీడీపీ నేత పరిటాల రవి కుమారుడు పరిటాల శ్రీరాంపై విమర్శలు గుప్పించారు. 
 
శ్రీరాం తన రాజకీయ ప్రత్యర్థులను హత్య చేస్తున్నారని ఇందులో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీకి చెందిన వారున్నారని ఆరోపించారు. అధికార తెలుగుదేశం పార్టీ ప్రోద్బలంతోనే ఆ చర్యలు సాగుతున్నాయని దుయ్యబట్టారు. ఈ క్రమంలోనే పరిటాల రవి సతీమణి రాష్ట్ర మంత్రి అయిన పరిటాల సునీత మైక్ తీసుకొని రోజాపై విరుచుకుపడ్డారు.
 
రోజా తెలుగుదేశం పార్టీలో ఉండగా ఏం మాట్లాడారో గుర్తుకుతెచ్చుకోవాలని సునీత చెప్పారు. టీడీపీ నాయకురాలిగా ఉన్నపుడు రాయలసీమలో పర్యటిస్తూ.. పరిటాల రవి బొమ్మకు దండవేసి నివాళులు అర్పించారని చెప్పారు. ఇదే క్రమంలో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డే పరిటాల రవిని చంపించారని ఆరోపించారని...ఆ విషయం ఇపుడు రోజా మరిచిపోయారా అంటూ ప్రశ్నించారు.
 
టీడీపీలో ఉన్నపుడు ఒకమాట...ఇపుడు ఒక మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రోజా చేసే విమర్శల్లో వాస్తవం ఉంటే...ఆధారాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. నాయకులు విశ్వసనీయత కాపాడుకునేలా మాట్లాడాలని సూచించారు.