శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ttdj
Last Updated : శనివారం, 28 మే 2016 (16:08 IST)

కేక్ నోట్లో పెట్టేందుకు యత్నించిన సీనియర్ నేత.. ఆగ్రహంతో ఊగిపోయిన బాలకృష్ణ!

తెదేపా శ్రేణులు, అభిమానులతో దురుసుగా ప్రవర్తిస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలిచే బాలకృష్ణ మరోసారి అదే పని చేశారు. తిరుపతిలో జరుగుతున్న మహానాడులో ఒక సీనియర్‌ నాయకుడిపై చిందులు తొక్కారు.
 
ఎన్‌టిఆర్‌ జయంతి కావడంతో మహానాడు సభా వేదికపై ఆయన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. కేక్‌ కట్ చేసి సీనియర్‌ నేతలు చంద్రబాబుకు తినిపించే ప్రయత్నం చేశారు. ఎక్కువ మంది చంద్రబాబునాయుడు కేక్‌ కట్‌ చేసి తినిపించారు.
 
అయితే బాలయ్యకు తక్కువ మంది మాత్రమే కేక్‌ను తినిపించారు. దీంతో పక్కనే ఉన్న శాఫ్ ఛైర్మన్‌ పి.ఆర్.మోహన్‌ బాలయ్యకు కేక్‌ కట్‌ చేసి తినిపించేందుకు ప్రయత్నించారు. దీంతో ఒక్కసారిగా బాలయ్య పి.ఆర్‌.మోహన్‌ వైపు చూస్తూ కాస్త తగ్గు.. తగ్గు అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు.
 
అంతటితో ఆగిపోలేదు.. అక్కడి నుంచి వెళ్ళు అంటూ తలతోనే సైగలు చేశారు. దీన్ని చూస్తున్న తెదేపా మంత్రులందరు ఏమీ అనలేక సినిమా చూసినట్లు కళ్లప్పగించి చూశారు. దీంతో మోహన్‌ సభావేదిక నుంచి కిందకు దిగేశారు. చాలా సేపటి వరకు ఆయన సభావేదికపైకి వెళ్ళలేదు. కొంతమంది సీనియర్‌ నేతలు ఆయన్ను బుజ్జగించిన తర్వాతనే సభావేదికపైకి వచ్చారు శాఫ్ ఛైర్మన్‌.