ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే : హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ
విభాజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని టీడీపీ నేత, హిందూపురం ఎమ్మెల్యే, సినీనటుడు బాలకృష్ణ అన్నారు. తిరుపతిలో జరుగుతున్న పార్టీ మహానాడులో ఆయన మాట్లాడుతూ... విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి తీరాలని డిమాండ్ చేశారు.
త్వరలో బీజేపీ అధిష్టానాన్ని కలిసి ప్రత్యేక హోదాపై మాట్లాడుతానని చంద్రబాబు చెప్పారన్నారు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం నందమూరి తారకరామారావేనన్నారు. దేశవ్యాప్తంగా తెలుగువారి కీర్తిని చాటిచెప్పిన మహనీయుడు ఎన్టిఆర్ అన్నారాయన. బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి, కార్మిక వర్గానికి వెన్నుదన్నుగా నిలిచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారకరామారావు మాత్రమేనన్నారు.
ఆయన అడుగు జాడల్లో నేడు తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నడుస్తున్నారని చెప్పారు. తెదేపా శ్రేణులందరు ఎన్ టిఆర్ కీర్తిని మహానాడులో కొనియాడారు.
తిరుపతిలోని టౌన్ క్లబ్ వద్దనున్న ఎన్టిఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాలకృష్ణతో పాటు సీఎం చంద్రబాబు కూడా నందమూరి తారకరామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అంతకుముందు ఎన్టిఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.