శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : బుధవారం, 19 నవంబరు 2014 (15:54 IST)

బాలకృష్ణ పల్లె నిద్రకు శ్రీకారం : స్మార్ట్ ఎల్ఈడీ సిటీగా హిందూపురం!

సినీ నటుడు, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ మంగళవారం పల్లె నిద్రకు శ్రీకారం చుట్టారు. తన నాలుగు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రెండో రోజైన మంగళవారం చిలమత్తూరు మండలం గాడ్రాళ్లపల్లిలో బస చేశారు. మధ్యాహ్నానికి గాడ్రాళ్లపల్లి చేరుకున్న బాలకృష్ణ గ్రామ సర్పంచ్, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో విడివిడిగా సమావేశమై, స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత 7 గంటల సమయంలో బస కోసం ఏర్పాటు చేసిన గదికి వెళ్లారు. 
 
గ్రామంలో పర్యటించిన బాలకృష్ణ మాట్లాడుతూ నియోజకవర్గాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతోపాటు పర్యాటక కేంద్రంగా తీర్చి దిద్దుతామని హామీ ఇచ్చారు. రూ.20 లక్షలతో హిందూపురం ఆస్పత్రి అభివృద్ధి, వంద పడకలుగా పెంచుతున్నట్లు చెప్పారు. హిందూపురాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు వ్యాపారవేత్తలతో చర్చిస్తున్నామన్నారు. ఇక్కడ నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, శిక్షణ ఇప్పించేందుకు త్వరలో ఎన్టీఆర్‌ శిక్షణా కేంద్రం ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం రూ.60 లక్షల నిధులు మంజూరయ్యాయని చెప్పారు. 
 
హిందూపురాన్ని స్మార్ట్‌ ఎల్‌ఈడీ సిటీగా ఎంపిక చేయాలని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడును, మున్సిపల్‌ మంత్రి నారాయణతో చర్చించి, ప్రతిపాదించినట్లు చెప్పారు. హిందూపురానికి హంద్రీనీవా నీరు తెచ్చే విషయమై ఈనె ల 26, 27 తేదీల్లో ఢిల్లీ వెళ్తున్నామన్నారు. హిందూపురం మీదుగా వెళ్లే సింగిల్‌ ట్రాక్‌ను డబుల్‌ ట్రాక్‌గా చేసి ఇంటర్‌సిటీ రైలు నడిపేందుకు కేంద్రంతో చర్చిస్తామన్నారు. నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అసైన్డ్‌ భూములు ఉన్నాయో గుర్తించి, వినియోగిస్తామన్నారు. పేదలకు పట్టాలు పంపిణీ చేస్తామన్నారు. శిల్పారామం నిర్మాణంకు రూ.5 కోట్లు మంజూరైనట్టు ఆయన తెలిపారు.