శుక్రవారం, 19 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By PNR
Last Updated : సోమవారం, 2 మార్చి 2015 (16:49 IST)

తొడగొట్టిన బాలకృష్ణ .. ఆత్మగౌరవం దెబ్బతీస్తే జనం తిరగబడతారు!

తెలుగువారి ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తే జనం తిరగబడుతారని హిందూపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, సినీ హీరో బాలకృష్ణ హెచ్చరించారు. అయితే, బాలకృష్ణ ఉన్నట్టుండి ఈ తరహా వ్యాఖ్యలు చేయడం వెనుక ఆంతర్యమేంటన్న అంశంపై ఇపుడు సర్వత్రా చర్చ సాగుతోంది. చంద్రబాబుకు తెలిసే బాలకృష్ణ ఆ వ్యాఖ్యలు చేశారా, చంద్రబాబు వ్యూహంలో భాగంగానే చేశారా అనేది తెలియడం లేదు.
 
అయితే, చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వర రావు, కేంద్ర సహాయ మంత్రి సుజనా చౌదరి కూడా అంతే తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. మోడీ ప్రభుత్వంలో కొనసాగే విషయంపై పునరాలోచన చేస్తామని వారన్నారు. చంద్రబాబుకు తెలియకుండా అంత తీవ్రమైన వ్యాఖ్యలు చేసేందుకు వారిద్దరు ముందుకు రారనే మాట వినిపిస్తోంది. బాలకృష్ణ కూడా ఆ వ్యూహంలో భాగంగానే ఆ వ్యాఖ్యలు చేసినట్లు భావించడానికి కూడా వీలుంది. 
 
కాగా, ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై, పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్లు మాత్రమే కేటాయించడంపై, విభజన హామీల విషయంలో కేంద్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యులు బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీలోని అంతర్గత అసంతృప్తిని చల్లాచర్చడానికి కూడా వ్యూహాత్మకంగా బాలయ్య ముందుకు వచ్చారా అనేది కూడా తెలియడం లేదు.