గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (10:09 IST)

కాళ్లు కట్టేసి.. ముఖానికి కవర్ చుట్టి.. మత్తు ఇంజెక్షన్ వేసి.. బ్యూటీషియన్‌పై అత్యాచారం?

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి హనుమాన్ జంక్షన్ ‌సమీపంలో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడమేకాకుండా కలకలం రేపింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు,

తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి హనుమాన్ జంక్షన్ ‌సమీపంలో ఓ బ్యూటీషియన్‌పై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం స్థానికులను భయభ్రాంతులకు గురిచేయడమేకాకుండా కలకలం రేపింది. నిందితుడు కత్తితో కర్కశంగా ఆమె చేతులు, మెడ కోశాడు. కాళ్లను వైర్‌తో కట్టేసి ఊడిపోకుండా ట్యాగ్‌లు వేశాడు. ముఖాన్ని కవర్‌తో ముసుగు వేసి పాశవికంగా దాడికి పాల్పడ్డాడు. ఇరుగుపొరుగు వాళ్లకు కేకలు వినిపించకుండా మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి విచక్షణారహితంగా కత్తిపోట్లు పొడిచాడు. తీవ్రగాయాలతో బాధితురాలు మృత్యువుతో పోరాడుతోంది.
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజమండ్రికి చెందిన పల్లె పద్మ అనే మహిళకు సూర్యనారాయణ అనే వ్యక్తితో 20 యేళ్ల క్రితం పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్యాభర్తల మధ్య ఏర్పడిన మనస్పర్థల కారణంగా పద్మ.. భర్త నుంచి విడిపోయి వేరుగా ఉంటోంది. 
 
ఈ క్రమంలో ఏలూరులోని వెన్నవల్లి వారి వీధికి చెందిన బత్తుల నూతనకుమార్‌ విక్టర్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడి, అది వారిద్దరి మధ్య సహజీవనానికి దారితీసింది. అదేసమయంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలోని ఓ బ్యూటీపార్లర్‌లో పద్మ బ్యూటీషియన్‌గా పని చేస్తుండగా, నూతనకుమార్‌ ఓ ప్రైవేట్‌ బ్యాంకులో మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. వీరిద్దరూ తారకరామ కాలనీ సమీపంలోని ఓ ఇంట్లో కలిసివుంటున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఈ నెల 23వ తేదీ రాత్రి పద్మ, నూతనకుమార్‌ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ విషయాన్ని భర్త దగ్గరే ఉంటున్న తన పెద్ద కూతురుతో ఫోన్‌లో పద్మ ఆ రాత్రే చెప్పింది. ఆ తర్వాత నుంచి ఆమె సెల్‌ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ రావటంతో ఆందోళన చెందిన కుమార్తె తన తండ్రి సూర్యనారాయణకు విషయం చెప్పింది. 
 
దీంతో ఇద్దరూ పద్మ అద్దెకు ఉంటున్న ఇంటి వద్దకు శనివారం ఉదయం వచ్చి తలుపులు తీయటంతో రక్తపు మడుగులో కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ కనిపించింది. జంక్షన్‌ పోలీసులకు సమాచారం అందించటంతో హుటాహుటిన 108 అంబులెన్స్‌లో పద్మను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. 
 
ఘటనా స్థలంలో దృశ్యం అత్యంత క్రూరంగా ఉండటం పోలీసులను సైతం విస్మయానికి గురిచేసింది. ఒంటిపై దుస్తులు తీసివేసి కత్తితో కర్కశంగా చేతులు, మెడ నరికివేయటం, కాళ్లు రెండు వైర్‌తో కట్టేసి, మళ్లీ ఆ వైర్‌ ఊడిపోకుండా ట్యాగ్‌లు వేయటం, ముఖానికి కవర్‌తో ముసుగు వేయటం హత్యాయత్నానికి పాల్పడిన దుండగుల పైశాచికత్వాన్ని తెలియజేస్తున్నాయి. 
 
పద్మ పడి ఉన్న గదిలో ఇంజక్షన్లు, సిరంజన్‌లు, మందు బాటిళ్లు పడి ఉన్నాయి. చుట్టుపక్కల నివాసం ఉంటున్న వాళ్లకు ఆమె అరుపులు వినిపించకూడదనే ఉద్దేశ్యంతో మత్తు ఇంజక్షన్‌ ఇచ్చి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బహుశా 24వ తేదీ ఉదయమే హత్యాయత్నం జరిగి ఉండవచ్చని ఘటనాస్థలిలో ఎండిపోయిన రక్తపు మరకలను బట్టి పోలీసులు అంచనా వేస్తున్నారు. పరారీలో ఉన్న నూతన్ కుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.