బుధవారం, 24 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: గురువారం, 2 నవంబరు 2017 (20:31 IST)

విశాఖలో వ్యవసాయ సాంకేతిక సదస్సు... బిల్ గేట్స్ వస్తున్నారు...

అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక సదస్సు-2017 నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని చిన్న,సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం నిర్వహించే ఈ సదస్సులో అంతర్జాత

అమరావతి: విశాఖపట్నంలో ఈ నెల 15 నుంచి మూడు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ సాంకేతిక సదస్సు-2017 నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి చెప్పారు. రాష్ట్రంలోని చిన్న,సన్నకారు రైతుల ప్రయోజనాల కోసం నిర్వహించే ఈ సదస్సులో అంతర్జాతీయ స్థాయి సాంకేతిక నిపుణులు, వ్యాపారవేత్తలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, విధాన నిర్ణయ ప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొంటారని తెలిపారు. సీఐఐ(కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ) నిర్వహించే ఈ సదస్సుకు దాల్ బర్గ్ సలహాదారుగా ఉన్నట్లు చెప్పారు. 
 
ఈ సదస్సుకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్, అన్ని రాష్ట్రాల వ్యవసాయ శాఖ మంత్రులు, సంబంధిత కార్యదర్శులు, వ్యవసాయశాఖ సంచాలకులను, దేశంలోని వ్యవసాయ, దాని అనుబంధ విశ్వవిద్యాలయాల కులపతులను, విద్యార్థలును, జాతీయ, అంతర్జాతీయ పరిశోధనా కేంద్రా శాస్త్రవేత్తలను, పరిశోధకులను, రాష్ట్రంలోని 13 జిల్లాలల్లోని అభ్యుదయ రైతులు, స్వచ్ఛంద సంస్థలను, వ్యవసాయశాఖ, దాని అనుబంధ శాఖల ఉన్నతాధికారులను, అయోవా విశ్వవిద్యాలయం, నెదర్లాండ్ విశ్వవిద్యాలయంల నుంచి ప్రతినిధులు వస్తారని చెప్పారు. 
 
వ్యవసాయ రంగంతోపాటు దాని అనుబంధ రంగాలైన ఉద్యానవన, రొయ్యలు, చేపల ఉత్పత్తి, పాడి పరిశ్రమ, వ్యవసాయ రంగంలో సాంకేతిక, సృజనాత్మకత, భూసార పరీక్షలు, వ్యవసాయానికి సంబంధించిన ఆధునిక పరికరాలు, నాణ్యమైన విత్తనాలు, వ్యవసాయ ఉత్పత్తులు, మార్కెటింగ్, పరపతి తదితర అంశాలను ఈ సదస్సులో చర్చిస్తారని మంత్రి వివరించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం మరింత అభివృద్ధికి, డిజిటల్ మ్యాపింగ్, ఉపగ్రహాల ద్వారా భూసార పరిక్షలు, వాతావరణం ప్రాతిపదికగా ఆధునిక సాంకేతికతతో వ్యవసాయ ఉత్పత్తుల దిగుబడి పెంచేందుకు చిన్న, సన్నకారు రైతులు లాభసాటి వ్యవసాయం చేసేందుకు కావలసిన సహకారం బిల్ అండ్ మిలిండ గేట్స్ ఫౌండేషన్ అందిస్తుందని చెప్పారు. 
 
ఇప్పటికే ఈ ఫౌండేషన్ ఆఫ్రికాలోని నూతన టెక్నాలజీతో ఫలితాలు సాధిస్తున్నట్లు తెలిపారు. ఇది లాభాపేక్షలేని సంస్థ అని తెలిపారు. ఈ ఫౌండేషన్ మన దేశంలో బీహార్, ఒరిస్సా రాష్ట్రాలతో కూడా ఒప్పందాలు చేసుకున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యున్నత ప్రమాణాలతో అయోవా విశ్వవిద్యాలయంలో పరిశోధనలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు.
 
అమెరికాలో వెయ్యి ఎకరాలను ఒకే కుటుంబం సాగు చేస్తుందని, వారు వాడే యంత్రాల ఖరీదు రూ.22 కోట్ల రూపాయల వరకు ఉంటాయని తెలిపారు. అక్కడ పొలాల్లో ఒకరిద్దరే పని చేస్తుంటారన్నారు. ఆ రకమైన వ్యవసాయం ఇక్కడ సాధ్యం కాదని, ఇక్కడ అన్ని చిన్న కమతాలే ఉంటాయని చెప్పారు. మనకు అనుకూలమైన యంత్రాలు కావాలన్నారు. మన రాష్ట్రంలో రూ.160 కోట్లతో సీడ్ ప్రాసెసింగ్ యూనిట్ నెలకొల్పనున్నట్లు చెప్పారు. ఈ నెల 17న జరిగే సదస్సు ముగింపు రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, బిల్ గేట్స్ పాల్గొంటారని తెలిపారు. ఈ సదస్సు అంశం అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం జరిగిందని, బిల్ గేట్స్ కూడా వస్తున్నట్లు తెలియడంతో అనేకమంది ఇక్కడికి రావడానికి ఆసక్తి చూపుతున్నారని, తమకు కూడా ఆహ్వానాలు పంపమని కోరుతూ పలువురు మెస్సేజ్‌లు పంపినట్లు చెప్పారు.